మంత్రి గంటాకు షాక్: ఆస్తుల స్వాధీనానికి బ్యాంక్ నోటీస్
మంత్రి గంటా శ్రీనివాస రావుకు ఇండియన్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. ఆయన ఆస్తుల స్వాధీనానికి నోటీస్ జారీ చేసింది. అప్పు చెల్లించకపోవడంతో ఆ నోటీస్ జారీ అయింది.
మంత్రి గంటా శ్రీనివాస రావుకు ఇండియన్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. ఆయన ఆస్తుల స్వాధీనానికి నోటీస్ జారీ చేసింది. అప్పు చెల్లించకపోవడంతో ఆ నోటీస్ జారీ అయింది.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇండియన్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. ఆయన హామీగా ఉన్న కంపెనీ రూ.141.68 కోట్లు రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు విశాఖపట్నంలోని ఇండియన్ బ్యాంకు నోటీస్ జారీ చేసింది.
ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇనఫ్రా కంపెనీ గతంలో విడతలవారీగా ఈ బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. అందుకుగాను కంపెనీ డైరెక్టర్లు పరుచూరి రాజారావు, పరుచూరి ప్రభాకరరావు, పరుచూరి వెంకట భాస్కరరావు తదితరులు వివిధ ప్రాంతాల్లో భూములు, భవనాలను బ్యాంకులో తనఖాగా పెట్టారు. వీరి రుణానికి మంత్రి గంటా తోపాటు మరికొందరు హామీదారులుగా ఉన్నారు.
ఈ కంపెనీ రుణంగా తీసుకున్న మొత్తం వడ్డీతో కలిపి రూ.196.51 కోట్లు కాగా దాన్ని సకాలంలో చెల్లించకపోవడం, నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో హామీగా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు బ్యాంకు ప్రకటించింది.
మంత్రిగా హామీగా పెట్టిన వాటిలో ఎంవీపీ కాలనీలోని ఆయన ఇల్లు, బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని ఒక ఫ్లాటు, అనకాపల్లి, చోడవరాల్లో వ్యవసాయ భూమి, కూర్మన్నపాలెంలోని కొంత భూమి ఉన్నాయి.