నువ్వేంత.. నీ లెక్కేంత.. ఆఫ్ట్రాల్.. సభా వేదికపై జగదీశ్ వర్సెస్ ఉత్తమ్ మాటల యుద్దం..(వీడియో)
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటలయుద్ధం జరిగింది. నువ్వేంత.. నీ లెక్కేంత.. ఆఫ్ట్రాల్ అనేవరకు వెళ్లింది. ఆదివారం నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో నియంత్రిత సాగుపై రైతులతో సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి మాట్లాడుతుండగా.. ఉత్తమ్ కల్పించుకోవడంతో వాగ్వావాదానికి దారితీసింది. ఒకానొక సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవడంతో ఉద్రిక్త నెలకొంది. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. వారిద్దరూ వినిపించుకోలేదు.
నువ్వేంత ఆఫ్ట్రాల్..
నియంత్రతిత సాగు విధానంపై నేతలు ఒక్కొక్కరు మాట్లాడారు. ముందుగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. ఆ సమయంలో మంత్రి జగదీశ్ రెడ్డి కల్పించుకోలేదు. తర్వాత మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడే.. సమయంలో ఉత్తమ్ కల్పించుకోవడంతో వాగ్వివాదానికి దారితీసింది. రుణ మాఫీ గురించి జగదీశ్ రెడ్డి ప్రస్తావించగా.. ఉత్తమ్ కల్పించుకున్నారు. రుణమాఫీ ఎక్కడ చేశారు.. ఎవరికీ చేశారు అని ఉత్తమ్ అనడంతో జగదీశ్ రెడ్డి ఆగ్రహాంతో ఊగిపోయారు. రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో లెక్కలతో సహా చెప్పారని జగదీశ్ గుర్తుచేశారు. అంతేకాదు దేశంలో రూ. లక్ష వరకు రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. పెట్టిన రూపాయికి సంబంధించి అసెంబ్లీలో ప్రతీ అక్షరం పొల్లుపోకుండా తెలిపారని గుర్తుచేశారు. కానీ ప్రిపేర్ కాలేదని వెళ్లిపోయింది మీరు కాదా అని ప్రశ్నించారు.
నీ లెక్కేంది..
కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో దేశం, రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయాయని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వలేదని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఉచిత విద్యుత్ ఇవ్వలేదన్నారు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు.. నేను ప్రసంగించే సమయంలో జోక్యం చేసుకోవడం సరికాదు. ఇదీ అసెంబ్లీ కాదు.. నేనేం చెప్పదలచుకున్నానో చెబుతాను.. ఎందుకు మధ్యలో వస్తున్నావు.. ఆఫ్ట్రాల్ నువ్వేంది.. నీ లెక్కేందీ.. ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని జగదీశ్ అనడంతో... ఉత్తమ్ కూడా అదేరీతిలో స్పందించారు.
Recommended Video
మంత్రి వర్సెస్ పీసీసీ చీఫ్
రూ.2500 కోట్లు బకాయి గురించి నోరు మెదపరేం అని ఉత్తమ్ అన్నారు. మీడియా ముందుకు ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేనెక్కడ అసెంబ్లీ నుంచి పారిపోయా.. అని అడిగారు. మంత్రిగా మంచిగా ప్రవర్తించు అని హితబోధ చేశారు. మధ్యలో నేతలు కల్పించుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. వినిపించుకోలేదు. మంత్రి కావడం జిల్లాకు పట్టిన దురదృష్టం అని ఉత్తమ్ అనగా.. పీసీసీ చీఫ్గా ఉండటం దురదృష్టకరం అని.. ఇదీ మీ పార్టీ వాళ్లే అంటున్నారని జగదీశ్ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
సభా వేదికపై జగదీశ్ వర్సెస్ ఉత్తమ్ మాటల యుద్దం..#CongressForIndia #TRS #Telanagana pic.twitter.com/1za9aAjRpI
— oneindiatelugu (@oneindiatelugu) June 1, 2020