ఏడ్చే మగాడిని నమ్మకూడదు:మోత్కుపల్లి పై మండిపడిన మంత్రి జవహర్
అమరావతి:చంద్రబాబుపై తిరుగబాటు చేసిన తెలంగాణా నేత మోత్కుపల్లి నర్సింహులుపై ఎపి మంత్రి జవహర్ మండిపడ్డారు. మోత్కుపల్లి కి గవర్నరో,రాజ్యసభ సభ్యుడు లాంటి పదవులు రాకపోయేసరికి చంద్రబాబు పై దిగజారుడు వ్యాఖ్యలు చేయటం సరి కాదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ ధ్వజమెత్తారు.
Recommended Video
సచివాలయంలోని తన ఛాంబర్ నుంచి ఆయన మోత్కుపల్లిపై విమర్శలకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. మోత్కుపల్లి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రియమైన శిష్యుడ్ని అంటూనే టీడీపిని విమర్శించటం సరి కాదన్నారు.
తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు...ఏడ్చే మగాడిని నమ్మకూడదు అనే సామెతలను మోత్కుపల్లి నిజం చేశారని మంత్రి జవహర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని మోత్కుపల్లి తెలుసుకోలేకపోయారని విమర్శించారు. ప్రధానంగా జీవో నెంబర్ 25 ను పక్కాగా అమలు చేయడం ద్వారా మాదిగలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తున్నామన్నారు. మాదిగ దొరగా పేరొందిన నీవు తెలంగాణలో మందకృష్ణ మాదిగ అరెస్ట్ చేసినప్పుడు ఏమయ్యవని మంత్రి జవహర్ ప్రశ్నించారు.
నీ వెనుక ఉండి అడిస్తున్న శక్తులు ఎవరో మాదిగలు సోదరులు గమనించి నీకు తగిన గుణపాఠం చెబుతా మంత్రి హెచ్చరించారు.
టీఆర్ఎస్, బీజేపీ అజెండా చూసి ధృత రాష్ట్ర పాలన కావాలని మోత్కుపల్లి నర్సింహులు కోరుకుంటున్నారని జవహర్ మండిపడ్డారు. ఇప్పటికైనా టిడిపి తల్లీ పాలు తాగిన నువ్వు కృతజ్ఞతతో ఉండకపోతే తీవ్రమైన పరిణామాలకు గురికావాల్సి వస్తుందని మంత్రి జవహర్ హెచ్చరించారు. తెలంగాణ మంత్రి వర్గంలో మాదిగలకు, మహిళలకు తగిన గుర్తింపు ఇవ్వలేదని తెలిసినా మోత్కుపల్లి నోరు మెదపకుండా ఉన్నారని విమర్శించారు.