జగన్ సమాధానం చెప్పు!..మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ;బిజెపి నేతలకి పరిజ్ఞానం లేదు:మంత్రి సోమిరెడ్డ
అమరావతి:ప్రతిపక్ష నేత జగన్ కేసుల మాఫీ కోసం ప్రధాని మోడీ, బీజేపీ అధినేత అమిత్ షాతో కుమ్మక్కై...రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని మంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు.
తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జగన్ ను నిలదీస్తూ మత్రి కళా వెంకట్రావు ఒక బహిరంగ లేఖ రాశారు. జగన్ మీరు ప్రతిపక్ష నేతగా ఏనాడైనా ప్రజల కోసం పని చేశారా అని కళా వెంకట్రావు ఆ లేఖలో ప్రశ్నించారు. తుపానుతో సిక్కోలు ప్రాంతం కకావికలమైతే బాధితులను ఇప్పటివరకూ ఎందుకు పరామర్శించలేదనిమంత్రి కళా వెంకట్రావు నిలదీశారు.
జగన్ పాదయాత్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే చేస్తున్నప్పటికీ...రైల్వేజోన్, ఉత్తరాంధ్రకు నిధులపై ఏనాడు ప్రశ్నించలేదెందుకని అడిగారు. పోలవరం డీపీఆర్-2కు కేంద్రం కొర్రీలు వేస్తున్నా ఆ విషయంపై ఎప్పుడూ ఎందుకు మాట్లాడరన్నారు. అలాగే రాఫెల్ కుంభకోణంపై కూడా జగన్ నోరు విప్పలేదెందుకని మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు.
మరోవైపు టిడిపిపై విమర్శలు చేస్తున్న బిజెపి, కెసిఆర్ పై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. శుక్రవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ నేత మురళీధరరావు...తెలంగాణా సిఎం కేసీఆర్ మాట్లాడేవి ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రాసిచ్చిన స్క్రిప్ట్ లేనని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిన విషయాన్ని మంత్రి సోమిరెడ్డి గుర్తుచేశారు. బీజేపీ నేతలు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని...ఒక సీటు కూడా గెలవలేని బీజేపీ...తెలుగుదేశం పార్టీని విమర్శించడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఓడిపోతే ఫామ్ హౌస్లో పడుకుంటానంటున్నకేసీఆర్ ఒక నాయకుడా?...అని మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు.