జర్నలిస్టులకు ప్రభుత్వం శుభవార్త...ఇళ్ల కోసం పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం
అమరావతి:జర్నలిస్టులకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం పేర్ల నమోదు కార్యక్రమాన్ని మంత్రి కాల్వ శ్రీనివాసులు మంగళవారం ప్రారంభించారు. జర్నలిస్టుల పేర్ల నమోదు కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్సైబ్ రూపొందించిన సంగతి తెలిసిందే...
అర్హులైన జర్నలిస్టులు ఆన్లైన్లోనే పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జర్నలిస్టులకు కూడా సొంతిల్లు ఉండాలనే సదుద్దేశంతోనే సీఎం చంద్రబాబు ఈ స్కీమ్ రూపొందించారని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఈ సందర్భంగా తెలిపారు. సొంతిల్లు ఉండాలనే కలను సాకారం చేసే ప్రక్రియలో భాగంగానే ఈ స్కీమ్ రూపకల్పన చేసినట్లుగా వివరించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పక్కా ఇళ్ల పథకంలో జర్నలిస్టులను కూడా లబ్దిదారులుగా చేర్చడం జరిగిందన్నారు. అందుకోసమే ఇళ్ల కేటాయింపుకోసం జర్నలిస్టుల వివరాలు సేకరణ...పేర్లు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా మంత్రి కాల్వ వివరించారు. ఈ పథకంపై జర్నలిస్టులు ఎలాంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ఒకవేళ జర్నలిస్టుల కుటుంబ సభ్యుల పేర్లతో స్థలం ఉన్నా...రాయితీ వర్తిస్తుందని మంత్రి కాల్వ స్పష్టం చేశారు.
జర్నలిస్టుల అక్రిడేషన్, ఆధార్ నంబర్ల ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక సాప్ట్వేర్ను రూపొందించారు. అలా ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి రూపొందించిన ఈ వెబ్సైట్ మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.