బాబు-షా క్లియర్: బీజేపీ మంత్రి ఫైర్, అందుకే బీజేపీపై: కేశినేని ట్విస్ట్
అమరావతి: ఏపీలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు ఉంటుందని తమ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా చెప్పారని మంత్రి, బీజేపీ ఏపీ నేత కామినేని శ్రీనివాస రావు బుధవారం చెప్పారు. అమిత్ షా నిన్ననే స్పష్టం చేశారన్నారు.
చదవండి: భూమా ఫ్యామిలీతో పోటీ, సర్వేతో టిక్కెట్: శిల్పా
అమిత్ షా, టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రెండు పార్టీల బంధంపై స్పష్టతతో ఉన్నారని కామినేని తెలిపారు.
ఇది పద్ధతి కాదు..
కిందిస్థాయిలో స్థానిక సమస్యల వల్ల పొత్తుపై తలో మాట మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని కామినేని వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తుపై కేశినేని నాని మాట్లాడిన నేపథ్యంలో కామినేని పైవిధంగా స్పందించారు.
గురువారం విజయవాడ పర్యటనకు హైదరాబాద్ నుంచి అమిత్ షా, చంద్రబాబు కలిసి గన్నవరం చేరుకుంటారని తెలిపారు. అలాగే, కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ప్రభు ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన అంబులెన్స్లను అమిత్ షా, చంద్రబాబు కలిసి ప్రారంభిస్తారన్నారు.
బీజేపీపై కేశినేని వ్యాఖ్యల రగడ
తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని రెండు రోజుల క్రితం బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు, బుధవారం తన మాటలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. అదే సమయంలో టిడిపి - బిజెపి పొత్తుపై చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కామినేని పైవిధంగా స్పందించారు.
బీజేపీతో పొత్తు లేకుంటే తాను ఇప్పటి కంటే డబుల్ మెజార్టీతో గెలిచేవాడినని నాని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ మండిపడింది. ఆ వ్యాఖ్యలు పార్టీ తరఫున చేసినవా, లేక వ్యక్తిగతమా తేల్చాలని బీజేపీ ప్రశ్నించింది.
పార్టీవో, వ్యక్తిగతమో తేల్చుకోవాలని మెలిక
కేశినేని నాని మాత్రం తనదైన శైలిలో స్పందించారు. తాను పార్లమెంటు సభ్యుడిని అని, తన వ్యాఖ్యలు వ్యక్తిగతమో, పార్టీవో మీరే నిర్ణయించుకోవాలని బదులిచ్చారు.
అందుకే బీజేపీని అన్నా...
పార్టీ అంతర్గత సమావేశంలోనే పొత్తులపై మాట్లాడాననీ, తానేమీ బహిరంగంగా వ్యాఖ్యానించలేదని కేశినేని నాని చెప్పారు. అంతేకాదు, కార్యకర్తల్లో భరోసా, ఆత్మవిశ్వాసం నింపడం కోసమే తాను మాట్లాడినట్టు చెప్పారు.
విజయవాడకు మాత్రమే పరిమితమని మరో ట్విస్ట్
తన వ్యాఖ్యలు విజయవాడ లోకసభ నియోజకవర్గ పరిధి వరకు మాత్రమే వర్తిస్తాయని, రాష్ట్రంలో పొత్తులపై తనకు సంబంధం లేదని ట్విస్ట్ ఇచ్చారు. పొత్తులపై పార్టీ అధిష్ఠానం తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. పొత్తులు, నామినేటెడ్ పదవులు అనేవి అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.
కేశినేని నాని
తాను చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు వివరణ అడిగితే ఇస్తానని, ఆయనే తనకు అధిష్ఠానం అని నాని అన్నారు. తనకు ఆత్మవిశ్వాసం పాళ్లు ఎక్కువని, తన తల పగిలినా ఫర్వాలేదు కొండను సైతం ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టిడిపి జెండాను రెపరెపలాడించడమే లక్ష్యం అన్నారు.