'పవన్ మంచి స్నేహితుడు, వెంకయ్య ఒక్కరే': ఏపీ పట్ల ఎంతో తపన ఉంది
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చర్యల వల్ల ఏపీలో బీజేపీ పూర్తిగా చచ్చిపోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం, హోదా కోసం ఏపీలో పోరాటాలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు శనివారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
ఏపీలో తాజా పరిణామాలపై గంటపాటు ప్రధాని మోడీతో వారు పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్యాకేజీని ప్రకటించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ హరిబాబు మాట్లాడుతూ ప్రజలు, ఆందోళనకారులు, విమర్శకులు, టీడీపీ శ్రేణులు ప్రత్యేక ప్యాకేజీని అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్కు ఏం లాభం జరుగుతుందో ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. దీనిపై తమ పార్టీ త్వరలోనే ఏపీలో సభలు నిర్వహిస్తుందని చెప్పారు.
మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి స్నేహితుడని, మా ఇద్దరి మధ్య సత్సంబంధాలున్నాయని చెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర మంత్రి వెంకయ్య ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. విభజన సమయంలో వెంకయ్య ఒక్కరే ఏపీ కోసం పోరాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఎవరూ అనాడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అంతేకాదు కేంద్రంలో ఈరోజు ఏపీకి అడ్రస్ ఎవరంటే ఒక్క వెంకయ్య నాయుడేనని స్పష్టం చేశారు. ఎయిమ్స్ కానీ, ఏపీకి ఏ అవసరం వచ్చినా కేంద్రంలో పెద్దగా ఉండి అన్ని పనులు చేసిపెడుతున్నారని ఆయనపై విమర్శలు తగవని పేర్కొన్నారు.
కేంద్రంలో వెంకయ్య నాయుడు ఏపీ పట్ల ఎంతో తపన పడుతున్నారని అన్నారు. విభజన సమయంలో ఆయన మాట్లాడిన విధానాన్ని ఏపీ ప్రజలంతా ఎంతగానో సంతోషించారన్నారు. రాష్ట్రానికి సహాయం చేసే వాళ్లని గౌరవిద్దామని, గౌరవిస్తేనే ఇంకా సహాయం చేసేందుకు ముందుకొస్తారని అన్నారు.
రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, చిదంబరమేనని పేర్కొన్నారు. అంతేకాదు ఎవరైతే ఏపీకి ద్రోహం చేశారో వాళ్లకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజ్యసభ సీటు ఇచ్చారని వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటించిన ఆర్ధిక సాయంలో ఏం ఇచ్చిందో ప్రజలకు చెబుతామని అన్నారు.
బీజేపీ ఏం చేసిందో ప్రజలు గుర్తించాలన్నారు. ఈ రెండున్నరేళ్లలో వెంకయ్య ప్రసక్తి లేకుండా ఏపీకి ఏం జరగలేదని చెప్పుకొచ్చారు. అలాంటి వెంకయ్యను విమర్శించడం రాష్ట్రానికి మంచిదికాదని చెప్పారు. ఏపీకి వెంకయ్య అండగా ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలంతా ఆయనకు రుణపడి ఉన్నారన్నారు.