షాక్: 'లక్ష్మీనారాయణ అంటే జగన్కు దడ', మాకేం కేసుల్లేవా: సాక్షి జర్నలిస్ట్ కేసుపై డిజిపి
విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ సీబీఐ జేడీ లక్ష్మినారాయణ అంటే భయమా? అంటే అవుననే అంటున్నారు.. బిజెపి నేత, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు. ఆయన గురువారం నాడు విశాఖలో విలేకరులతో మాట్లాడారు.
సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ ఉన్నంతకాలం జగన్ నోరు మెదపలేదని ఎద్దేవా చేశారు. లక్ష్మీనారాయణ బదలీ అయ్యాకే జగన్కు బెయిల్ వచ్చిందని చెప్పారు. మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అంటే జగన్కు దడ అని ఎద్దేవా చేశారు.
జగన్ అసెంబ్లీని లోటస్ పాండు అనుకుంటున్నట్లుగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఎప్పుడు పడితే అఫ్పుడు అవిశ్వాస తీర్మానాలు పెట్టడం విడ్డూరం అన్నారు. కోర్టుల చుట్టూ తిరిగే జగన్కు ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కాగా, జగన్ ఆస్తుల కేసును లక్ష్మీనారాయణ గతంలో సిబీఐ జేడీ హోదాలో చూశారు.
జర్నలిస్ట్ల తప్పులేకుండా కేసు ఎలా పెడతాం: డిజిపి రాముడు
ఏపీ రాజధాని భూములకు సంబంధించి వార్తలు రాసిన జర్నలిస్టుల తప్పులేకుండా వారిపై కేసులు ఎందుకు పెడతామని ఏపీ డీజీపీ జేవీ రాముడు గురువారం ప్రశ్నించారు. మాకేమన్నా కేసులు లేక జర్నలిస్టులపై కేసులు పెడతామా అని ధ్వజమెత్తారు.
సమాజంలో ఒక హోదా ఉన్న వ్యక్తులపై నిరాధారమైన వార్తలు రాయకూడదన్నారు. ఆ పని చేస్తే కనుక, వార్తలు రాసిన వారే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. జర్నలిస్టులు తప్పుందా? లేదా? అనే విషయమై విచారిస్తున్నామన్నారు. కొత్త చట్టంతో కఠినశిక్షళు ఉంటాయన్నారు. పాత చట్టాల్లో కోరలు లేక నేరస్తులు తప్పించుకుంటున్నారన్నారు. ఇప్పటికే చాలామంది ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్టు చేశామని చెప్పారు.