చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోంది.. బినామీ ఆస్తుల కోసమే ఉద్యమాలు : కన్నబాబు
అభివృద్ది వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్దిని సీఎం జగన్ కోరుకుంటున్నారని.. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతీ దానికి సైంధవుడిలా అడ్డుపడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్దిని చంద్రబాబు ఇంకెంతకాలం అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు. అభివృద్ది వికేంద్రీకరణ,మండలి రద్దులను అడ్డుకుంటే ప్రజలు చంద్రబాబును మరింతగా తిరస్కరిస్తారని అన్నారు.
కేవలం బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు అమరావతిలో కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. అమరావతిలో జరిగిన అక్రమాలు బయటపడుతుంటే చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న చంద్రబాబు.. ఉత్తరాంధ్ర,రాయలసీమ ప్రజలు ఇంకా వెనుకబాటుతనంలోనే ఉండాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు.
ఇక కాపు మహిళల కోసం ప్రవేశపెట్టిన కాపు నేస్తం పథకంపై కన్నబాబు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడ్డ కాపులకు ఈ పథకం ఎంతగానో మేలు చేస్తుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రైతు భరోసా, నాడు-నేడు, నేతన్న హస్తం, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు జగన్ భరోసా ఇస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాలు,అన్ని వర్గాలు సమానంగా అభివృద్ది చెందాలన్నదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.