ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు డ్రామాలు .. దిగజారుడు రాజకీయాలు: మంత్రి కన్నబాబు ఆగ్రహం
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు కేవలం తన స్వార్ధ రాజకీయాల కోసం ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర ప్రజల ఖ్యాతిని తగ్గిస్తున్నారు అని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల దందా విచ్చలవిడిగా కొనసాగుతున్నట్టు ఆయన ఢిల్లీ వీధుల్లో చెబుతున్నారని మండిపడిన కన్నబాబు దేశం మొత్తం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంటే, ఏపీ ప్రతిష్టను దిగజార్చడం కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ఇతర రాష్ట్రాలు ఏమి అనుకుంటాయి? అంటూ అసహనం వ్యక్తం చేశారు.
టీడీపీ హయాంలో పంట రుణమాఫీ కింద ఇచ్చిన దాని కంటే ఎక్కువే వైసీపీ హయాంలో ఇచ్చాం
ఇప్పటివరకు రైతు భరోసా కింద 18,777 కోట్ల రూపాయలు ఇచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. వైయస్ఆర్ రైతు భరోసా, సున్నా వడ్డీ పథకం, వైయస్సార్ యంత్ర సేవ పథకాలను ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన క్రమంలో ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి కన్నబాబు గతంలో టిడిపి హయాంలో పంట రుణమాఫీ కింద 12,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తే, తాము ఈ రెండున్నరేళ్ళలో 18,777 కోట్ల రూపాయలను ఇచ్చామని కన్నబాబు వెల్లడించారు.
రాజధానిని నాశనం చేశారని చెప్పిన చంద్రబాబు ..తెలంగాణలో 10 ఏళ్ళ హక్కు వదిలేశారే ?
వైసీపీ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేస్తున్నామని పేర్కొన్న కన్నబాబు కావాలనే తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రపతి రాజధాని గురించి అడిగితే తెలుగుదేశం పార్టీ నేతలు రాజధానిని జగన్ నాశనం చేశారని చెప్పారట అంటూ పేర్కొన్న మంత్రి కన్నబాబు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల హక్కును వదిలేసి ఇక్కడికి పారిపోయి వచ్చి మేమేదో నాశనం చేశామని చెప్పడం దేనికి అంటూ ప్రశ్నించారు.
పార్టీ బతికుంది అని చెప్పుకునే ప్రయత్నమే ఇది
దిగజారుడు రాజకీయాలు చేసి డిల్లీ వీధుల్లో డ్రామాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ అవసరాలకోసం మూడు రాజధానులు అడ్డుపెట్టుకొని వైసీపీపై నిందలు వేయడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చేస్తుంది పార్టీ బతికుంది అని చెప్పుకునే ప్రయత్నమంటూ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు డ్రామాలన్నీ మోడీ, అమిత్ షా లకు తెలుసు అని పేర్కొన్న కన్నబాబు వాళ్లకి ఏపీ వాస్తవ పరిస్థితులు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు వాళ్ల గురించి మాట్లాడిన మాటలు కూడా తెలుసంటూ గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఎప్పుడు 356 పెట్టాలో వాళ్లకు తెలీదా?
రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న చంద్రబాబునాయుడుపై కచ్చితంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు మంత్రి కన్నబాబు. చంద్రబాబుకు నిబద్ధత, క్రమశిక్షణ, కట్టుబాటు లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కురసాల కన్నబాబు రాష్ట్రంలో ఎప్పుడు 356 పెట్టాలో వాళ్లకు తెలీదా? చంద్రబాబే నేర్పిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై పట్టాభి వ్యాఖ్యల తర్వాత వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడంతో మొదలైన ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటికీ కొనసాగుతూనే ఉంది.