చంద్రబాబు సైంధవుడు .. అభివృద్ధి నిరోధకుడు : మంత్రి కన్నబాబు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి కురసాల కన్నబాబు విరుచుకుపడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారని కానీ చంద్రబాబు అడుగడుగునా అడ్డు పడుతున్నారని మంత్రి కన్నబాబు ఆరోపిస్తున్నారు . కాకినాడలో పర్యటించిన మంత్రి కన్నబాబు మాజీ సీఎం చంద్రబాబును సైంధవుడని , అభివృద్ధి నిరోధకుడని మండిపడ్డారు.
శానస మండలి రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణను టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకుంటే ప్రజలు చంద్రబాబును మరింత తిరస్కరిస్తారని అన్నారు. ప్రజల్లో చంద్రబాబు మీద ఇప్పటికే నమ్మకం లేదని , బాబు అభివృద్ధిని అడ్డుకుని మూడు రాజధానులు కాకుండా చేస్తే దాని ఫలితం అనుభవిస్తారని ఆయన మండిపడ్డారు. అమరావతిలో జరిగిన అక్రమాలు వెలికితీస్తుంటే చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందని పేర్కొన్నారు . తన వారిని, రాజధాని అమరావతిలో ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారని మంత్రి కన్నబాబు నిప్పులు చెరిగారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చంద్రబాబుకు ఏమాత్రం అవసరం లేదన్నారు. కేవలం తాను, తన వారు ఉన్న అమరావతి బాగుపడితే చాలని చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు. సీఎం జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన ఏడు నెలల కాలంలోనే రాష్ట్ర ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలను అందిస్తూ జనరంజకంగా పాలిస్తున్నారని చెప్పారు. కాపు మహిళల కోసం కాపు నేస్తం పథకం ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కాపులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సీఎం జగన్ రైతు భరోసా, నాడు-నేడు, ఆరోగ్య శ్రీ , నేతన్న హస్తం వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. కానీ, చంద్రబాబు సైంధవుడిలా ప్రతీ దానికి అడ్డుపడుతున్నారని, ప్రగతిని ఆపటమే పనిగా పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు మంత్రి కన్నబాబు .