పిల్లనిచ్చిన మామను చంపించిన సన్నాసి .. రాజధానిలో కుక్కలు,దున్నపోతులతో పాటే బాబు : కొడాలి నానీ
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇక మరోమారు కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై విరుచుకుపడ్డారు. టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తుండడం పట్ల ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. చంద్రబాబును చాలా తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఒక సన్నాసి అని, ప్రజలు నేలకేసి కొట్టిన బుద్ధి రాలేదని ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.
నాలుగు భవనాలు,తుప్పలు,ముళ్ళపొదలు తప్ప రాజధానిలో ఏమున్నాయని బాబు పర్యటన
రాజధానిలో ప్రస్తుతం కుక్కలు, గొర్రెలు, మేకలు, దున్నపోతులు తిరుగుతున్నాయని,చంద్రబాబు కూడా వాటితో పాటే రాజధానిలో తిరుగుతారని కొడాలి నాని చంద్రబాబు నాయుడుని ఎద్దేవా చేశారు. అసలు రాజధానిలో ఏముందని పర్యటిస్తారని మండిపడ్డారు కొడాలి నాని. నాలుగు భవనాలు, తుప్పలు, ముళ్ళపొదలు తప్ప మరేమీ లేదని పేర్కొన్న నాని చంద్రబాబు ఉండేది రాజధానిలోనే కదా, మరి ఎక్కడినుంచో, చంద్రమండలం నుంచి వచ్చినట్టు అమరావతిలో పర్యటిస్తానని సొల్లు కబుర్లు చెబుతున్నారని పరుష పదజాలంతో దూషించారు.
సొల్లు కబుర్లు చెప్పటం తప్ప బాబుకు ఏం వచ్చు అన్న నానీ
ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్ర పోయేవరకు సొల్లు కబుర్లు చెప్పడమే చంద్రబాబునాయుడు పని అని నాని ఎద్దేవా చేశారు. అమరావతి పై సమీక్షలు, గ్రాఫిక్స్ రిలీజ్ చేయడం, మధ్యాహ్నం నుంచి పోలవరం పై సమీక్ష లో ఒక శాతమో, పావు శాతమో పని జరిగింది అని చెప్పడం ఈ రెండు అంశాలు తప్ప చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంకేది పట్టించుకోలేదని కొడాలి నాని విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు ఓ సన్నాసి .. ఆయన్ని నేలకేసి కొట్టి 23 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదు
చంద్రబాబు నాయుడుని నేలకేసి కొట్టి 23 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదని, చంద్రబాబు ఒక సన్నాసి అని తిట్టిపోశారు నాని. చంద్రబాబు పిల్లనిచ్చిన మామను చంపించిన సన్నాసి అని, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ మరణం తర్వాత సిబిఐ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించలేదు అని మంత్రి కొడాలి నాని తీవ్రంగా విమర్శించారు.అంతేకాదు చంద్రబాబు నాయుడుకి, ఆయన కొడుకు లోకేష్ కి బుర్ర సరిగా పని చేయదు అని బుర్ర ఉన్న నలుగురిని పెట్టుకొని ఓటమికి గల కారణాలను సమీక్ష చేసుకోవాలని హితవు పలికారు.
చంద్రబాబు టీం లో ఉన్న వారు ఐదు, పదివేలకు, రెండు పలావు పొట్లాలకు పని చేసేవారే
ఐదు, పదివేలకు, రెండు పలావు పొట్లాలకు, పాతిక లీటర్ల డీజిల్ కు పనిచేసేవాళ్లను కాకుండా కాస్త బుర్ర పెట్టి పనిచేసేవాళ్లను పనిలో పెట్టుకుని ఓటమిపై రివ్యూ నిర్వహించుకోవాలని సలహా ఇచ్చారు నాని. ఎందుకంటే జగన్ చిన్నవాడని, అయినా ఆయనకు చాలా క్రేజ్ ఉందని చెబుతున్న నాని, జగన్ ఇంత చిన్నవాడైనా అంత క్రేజ్ ఎందుకు వచ్చింది, ఇంత అనుభవం ఉండి కూడా మనం ఎందుకు సంకనాకి పోయాం అని తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంటూ చంద్రబాబుపై వ్యంగ్యంగా మాట్లాడారు.
ఆర్నెల్లలో ఇల్లే కట్టలేం .. కానీ జగన్ మీద బురద చల్లటమే లక్ష్యంగా చంద్రబాబు
ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన పై ఏనాడు సానుకూల ధోరణితో సలహాలు ఇవ్వలేదని పేర్కొన్నారు నానీ. ఆరునెలలలో కనీసం ఒక ఇంటిని కూడా నిర్మించడం సాధ్యం కాదు. అలాంటిది ఆర్నెల్లలో చంద్రబాబు నాయుడు జగన్ పై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకొని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ ను సైకో అని, దుర్మార్గుడివని,బాబాయిని చంపావు అని ఆరోపణలు చేయడం తప్ప ఎప్పుడూ మంచి ఉద్దేశంతో సలహాలు ఇవ్వలేదని పేర్కొన్నారు కొడాలి నాని.
పోలవరం, అమరావతి అంటూ అప్పుడూ , ఇప్పుడూ అదే పాట అని బాబుపై నానీ ఫైర్
తాము ఏమైనా అంటే బూతులు తిడుతున్నామంటూ పేర్కొన్న నాని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు రాజధాని అమరావతి, పోలవరం అంటూ నిత్యం ఏదో ఒక ప్రకటన చేసేవారని, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ఓడిపోయి ప్రతిపక్షంలో ఉండి కూడా చంద్రబాబు పోలవరం, అమరావతిలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారని మంత్రి కొడాలి నాని విమర్శించారు.ఇక తమకు పోలవరం, అమరావతి మాత్రమే కాదు 13 జిల్లాలు కూడా ఎంతో ముఖ్యం అని ప్రకటన చేసిన నాని రేపు చంద్రబాబు రాజధాని పర్యటన నేపథ్యంలో తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు.అయన పర్యటనకు ప్రాధాన్యత లేదన్నారు.