రైతులపై వారిది కపట ప్రేమ .. జూమ్ లో చంద్రబాబు , ట్విట్టర్ లో లోకేష్ : మంత్రి కొడాలి నానీ ఫైర్
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన సుపరిపాలన అని కొనియాడారు. ఇదే సమయంలో చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని జూమ్ యాప్ లో రాజకీయాలు చేస్తున్నారని, ఇక కుమారుడు లోకేష్ ట్విట్టర్లో రైతులపై కపట ప్రేమను చూపిస్తున్నారని మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన కొడాలి నాని చంద్రబాబు ఆయన తోకపార్టీలకు రాష్ట్రం సర్వ నాశనం అవుతున్న పరవాలేదు కానీ, 29 గ్రామాలతో కూడిన అమరావతి ఉంటే చాలంటూ మండిపడ్డారు.
తన సామాజిక వర్గానికి మేలు జరిగితే చాలు అన్నట్టు నీచ రాజకీయాలు
మిగతా ప్రాంతాలను పట్టించుకోకుండా చంద్రబాబు తన సామాజిక వర్గానికి మేలు జరిగితే చాలు అన్న రీతిలో నీచ రాజకీయాలు చేస్తున్నారని కొడాలి నాని విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోర్టుల ద్వారా స్టే తెచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ కొడాలి నాని నిప్పులు చెరిగారు. డిసెంబర్ 25వ తేదీన 30 లక్షల ఇళ్ల స్థలాలు పేదలకు పంపిణీ చేస్తామని, అసలు ఈ ఏడాది మార్చి 30వ తేదీన ఇవ్వాల్సిన నిర్ణయం జరిగినప్పటికీ చంద్రబాబు అడ్డు పడ్డాడని విమర్శించారు.
అన్ని సామాజిక వర్గాల వారి సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ సుపరి పాలన
రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేనని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేదలు, మహిళలు, రైతులు, అన్ని సామాజిక వర్గాల వారి సంక్షేమమే ధ్యేయంగా సుపరి పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఇన్పుట్ సబ్సిడీ అందించారని దేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఇంత త్వరగా పరిహారం ఇవ్వలేదని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు.
టిడిపి నేతలది రైతుల పై కపట ప్రేమ .. అందుకే ఇలా దుష్ప్రచారం
ఇక టిడిపి నేతలు రైతుల పై కపట ప్రేమ చూపిస్తున్నారు అంటూ మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా 3600 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసిన ఘనత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొడాలి నాని పేర్కొన్నారు. డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల పట్టాలనివ్వడమే కాకుండా ఈసారి సంక్రాంతికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబిసి యువకులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా 9260 సబ్సిడీ వాహనాలను అందిస్తామని కొడాలి నాని పేర్కొన్నారు . చంద్రబాబు, నారా లోకేష్ లు ఇప్పటికైనా తమ పంథా మార్చుకోవాలని చెప్పిన కొడాలి నాని ప్రభుత్వ సంక్షేమ పాలన ఓర్చుకోలేక ఇదంతా చేస్తున్నారంటూ విమర్శించారు.