అమరావతి రైతులపై కొడాలి విచిత్ర వ్యాఖ్యలు.. రాజధానిని తరలించట్లేదన్న మంత్రి
రాజధాని తరలింపుపై కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్, కల్పించిన భ్రమలు నమ్మి.. రైతులందరూ ఆకాశంలో తేలాడే పరిస్థితికి వెళ్లారని.. వాస్తవాల్ని గ్రహించి నేలకు దిగిరావడానికి కొంత టైమ్ పడుతుందని అన్నారు. ఆంద్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని ముఖ్యమంత్రి జగన్ గానీ, మంత్రులుగానీ, ఏ కమిటీ రిపోర్టుగానీ చెప్పలేదని, దీనిపై రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు.
రైతుల్ని ఆకాశంలో పెట్టింది చంద్రబాబే
‘‘అమరావతి పేరుతో చంద్రబాబు 33వేల ఎకరాలు సేకరించాడు. అక్కడేదో అద్భుతాలు జరుగుతాయని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు. సింగపూర్, జపాన్ లాంటి దేశాల మ్యాపులు చూపించి.. ఒక్కోటీ నాలుగు నిమిషాల నిడివిలో గ్రాఫిక్స్ వీడియోలు తయారుచేయించాడు. కళ్లుచెదిరిపోయే బిల్డింగ్స్, పడవలు, విమానాలు, రైళ్లు.. అంటూ ఏవేవో చూపించి భూములిచ్చిన రైతుల్ని ఆకాశంలో పెట్టాడు. కానీ వాస్తవమేంటి? చంద్రబాబు చెప్పిన గ్రాఫిక్స్ రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు కావాలి. అంత డబ్బు ప్రభుత్వం దగ్గర ఉందా?''అని మంత్రి నాని ప్రశ్నించారు.
మారడానికి టైమ్ పడుతుంది..
చంద్రబాబు మాయమాటలునమ్మి ఆకాశంలో ఉన్న రైతులు.. నిజానిజాల్ని గ్రహించి నేలమీదకు దిగిరావడానికి టైమ్ పడుతుందని, అదే సమయంలో ప్రభుత్వం కూడా తన బాధ్యతగా రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుందని, ఆర్థిక పరిస్థితిని, అన్ని ప్రాంతాలనూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని రైతులకు వివరిస్తామని, ఇవాళ కాకుంటే రేపు.. రేపు కాకుంటే ఎల్లుండైనా రైతులు సాధారణ స్థాయికి వస్తారనే ఆశిస్తున్నట్లు మంత్రి కొడాలి చెప్పారు.
రాజధానిని తరలించట్లేదు..
అన్ని ప్రాంతాలూ డెవలప్ కావాలంటే మూడు చోట్లా రాజధానులు ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశమని, ఆ క్రమంలోనే మూడు కమిటీల నివేదికలపై అసెంబ్లీలో చర్చించి, అన్ని జిల్లాల ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. ఈ మొత్తం ప్రాసెస్ లో అమరావతి నుంచి రాజధానిని తరలించే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అమరావతితోపాటే మరో రెండు రాజధానులుంటాయని క్లారిటీ ఇచ్చారు.
అప్పులు చేయడమే గొప్పపనా?
జగన్ సర్కారుకు సంపద క్రియేట్ చెయ్యడం చేతకాదన్న మాజీ సీఎం చంద్రబాబుపై కొడాలి నిప్పులు చెరిగారు. విభజన సమయంలో 90వేల కోట్లుగా ఉన్న అప్పుల్ని చంద్రబాబు 3.5లక్షలకు పెంచాడని, సంపద క్రియేట్ చేయడమంటే అప్పులు చేయడమేనని బాబు భ్రమిస్తున్నారని ఎద్దేవా చేశారు. అప్పులు చేయడంతోపాటు కాంట్రాక్టర్లకు 45వేల కోట్ల బిల్లుల్ని కూడా ఎగనామం పెట్టిన ఘనత చంద్రబాబుదని మంత్రి నాని విమర్శించారు.