2024 ఎన్నికల నాటికి నారా లోకేష్తో చంద్రబాబు టీడీపీ: ఎన్టీఆర్ టీడీపీ ఆయనకు: కొడాలి నాని
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై, ఆ పార్టీ నాయకులపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయన ఓ ఆసక్తికరమైన సవాల్ను విసిరారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు వారసులకు అప్పగించగలరా అని ప్రశ్నించారు. నారా లోకేష్తో ప్రత్యేకంగా చంద్రబాబు టీడీపీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం ఉందా అని నిలదీశారు.
ఆదివారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు విధానాలు, టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శలను తిప్పి కొట్టారు. చంద్రబాబుకు సిగ్గు ఉంటే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆయన కుమారులకు వదిలేయాలని అన్నారు చంద్రబాబుకే దమ్ము, ధైర్యం ఉంటే తనయుడు లోకేష్తో సీబీఎన్ టీడీపీని స్థాపించి 2024 ఎన్నికలకు రావాలని ఛాలెంజ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు గానీ, ఎమ్మెల్యేగా కూడా గెలవలేని చవట దద్దమ్మ నారా లోకేష్కు గానీ లేదని నిప్పులు చెరిగారు.
2014లో అధికారంలోకి వచ్చే ముందు తాను పూర్తిగా మారిపోయానని చంద్రబాబు చెప్పుకొన్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత గానీ ఆయన నిజస్వరూపం ప్రజలకు అర్థం కాలేదని అన్నారు. 87వేల కోట్ల రూపాయల రైతు రుణాలను పూర్తి రద్దు చేస్తానని, రైతు పక్షపాతిగా మారానని ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన రైతులను పూర్తిగా మోసం చేసిన వెన్నుపోటుదారుడిగా చంద్రబాబునాయుడు మిగిలిపోయారని కొడాలి నాని ఆరోపించారు.
రైతుల రుణాలను 12 వేల కోట్ల రూపాయల మేర మాత్రమే మాఫీ చేసి చంద్రబాబు చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. అన్నం పెట్టే రైతును మోసం చేయగల సామర్థ్యం ఉన్న చవట దద్దమ్మ చంద్రబాబు నాయుడని అన్నారు. ఎంతటి నీచానికైనా దిగజారతారనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైందని కొడాలి నాని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు రైతులకు 12,500 రూపాయలు చొప్పున చొప్పున నాలుగేళ్ల పాటు రైతు భరోసాగా ఇస్తానని వైఎస్ జగన్ ప్రకటించారని, అనంతరం దాన్ని 13,500 పెంచి ఇస్తున్నారని గుర్తు చేశారు.
Recommended Video
ఎన్ని అడ్డంకులు వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగు ముందుకే పడుతుందని, కరోనా సంక్షోభ సమయంలోనూ ముఖ్యమంత్రి సంక్షేమాన్ని విస్మరించలేదని అన్నారు. లాక్డౌన్ కాలంలో 20 కేజీలు తగ్గానని మహానాడులో నారా లోకేష్ చెప్పుకున్నాడని పిజ్జాలు, బర్గర్లు, ఐస్క్రీంలు లేక తగ్గినట్టు ఉన్నాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ప్రజా నాయకుడని, సొంతంగా పార్టీని స్థాపించి ప్రజల మధ్యకు వెళ్తే ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. ఆ తర్వాత రికార్డు స్థాయిలో 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేశారని అన్నారు.