అమరావతి రైతులపై మారిన వైఖరి: ప్రభుత్వ తాజా వ్యూహం: మంత్రి కొడాలికి బాధ్యతలు..!
మూడు రాజధానుల పైన వేగంగా అడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం..అమరావతి రైతుల విషయంలోనూ వైఖరి మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. దాదాపు 20 రోజులుగా ఆ ప్రాంత రైతులు..స్థానికులు ఆందోళన చేస్తుంటే..వారితో చర్చలు..వారిని బుజ్జగించే చర్యలు ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఒక దశలో వారి నిరసనల పైన కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు సైతం వివాదస్పదమయ్యాయి. వారి భూములను తిరిగి ఇచ్చేస్తామంటూ మంత్రులు వ్యాఖ్యానించారు.
అయితే, ఇక నిర్ణయం తీసుకోవటానికి సమయం దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం రైతులపైన వైఖరి మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు రైతులకు న్యాయం చేస్తామని చెప్పటం మినహా..ఏం చేస్తారో చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు..వారితో చర్చలకు సిద్దం అవుతోంది. ఆ బాధ్యతలను మంత్రి కొడాలి నానికి అప్పగించినట్లు తెలుస్తోంది. వారిని ముందుగా చర్చలకు ఒప్పిస్తే..వారి డిమాండ్లు తెలుసుకొని వారిని మెప్పించే ప్రయత్నం చేయవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
రైతులు చర్చలకు రండి...
అమరావతి ప్రాంత రైతులతో ప్రభుత్వం చర్చలకు సిద్దం అవుతోంది. ఇప్పటి వరకు వారి ఆందోళన వెనుక టీడీపీ ఉందని..రియల్టర్లు ఉన్నారని చెబుతూ వచ్చిన అధికార పార్టీ నేతలు..ఇంకా ఆందోళన కొనసాగు తుండటం..రాజకీయంగా ఇతర పార్టీలు వారికి మద్దతు పలుకుతుండటంతో వ్యూహం మార్చుకున్నారు. మూడు రాజధానుల పైన ప్రభుత్వం ముందుకే వెళ్లాలని భావిస్తోంది.
ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఈ నెల 17 లేదా 18 తేదీల్లో నివేదిక ఇవ్వనుంది. ఆ వెంటనే కేబినెట్..అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి..అధికారికంగా ముందుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో..అమరావతి ప్రాంతంలో ఇక ఆందోళనలు చేయకుండా..రైతులతో చర్చలు జరపాలని భావిస్తోంది. ఇందు కోసం మంత్రులను పంపాలని భావిస్తోంది. ముందుగా చర్చలకు రైతులు సిద్దంగా ఉన్నారా లేరా అనే అంశం పైన స్పష్టత కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
కొడాలి నానికి బాధ్యతలు..
మంత్రి కొడాలి నాని ప్రభుత్వం నుండి రైతులను చర్చలకు రావాలంటూ ఆహ్వానించిన తొలి మంత్రి. ఆయన తాజాగా.. అమరావతి రైతులు ప్రభుత్వంతో చర్చలకు వచ్చి వారి డిమాండ్లను వివరిస్తే న్యాయం చేయడానికి సీఎం జగన్ సిద్దంగా ఉన్నారని పిలుపునిచ్చారు. చంద్రబాబు మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు.
రైతులు సరైన అవగాహన..డిమాండ్లతో చర్చలకు వస్తే న్యాయం చేయటానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. కొద్ది రోజుల క్రితం రైతుల వద్దకు చర్చల పైన మంత్రులు బొత్సా..కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. రైతులు ఆవేశంలో ఉన్న సమయంలో స్థానిక ఎమ్మెల్యేలు వెళ్తే రైతుల ను మరింతగా రెచ్చగొట్టినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. మరో కీలక మంత్రి రైతులతో చర్చలు జరపలేమని..ఇప్పుడు సమయం కూడా కాదని చెప్పుకొచ్చారు. అయితే, ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను ..సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని కొడాలి నాని ద్వారా రైతులను చర్చలకు పిలిచే ప్రయత్నం ప్రభుత్వం మొదలు పెట్టినట్లుగా కనిపిస్తోంది.
చర్చలకు రైతులు సిద్దమేనా..
అమరావతి కోసం తాము భూములు ఇచ్చామని..ఇప్పుడు రాజధాని తరలిస్తే తమకు భవిష్యత్ లేదని ఆ ప్రాంత రైతులు వాపోతున్నారు. అమరావతి తరలించవద్దనేది వారి ప్రధాన..ఏకైక డిమాండ్. ప్రభుత్వం నుండి అమరావతిలో వ్యవసాయ జోన్ ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదన మీద రైతులు స్పందించలేదు. అయితే, ప్రభుత్వం నుండి అధికారికంగా చర్చలకు రావాలని ఆహ్వానం వస్తే..అందుకు రైతులు సిద్దంగా ఉన్నారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
ఇప్పటికే రాజధాని పరిరక్షణ సమితి పేరుతో హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేసారు. ఈ సమయంలో ప్రభుత్వం వద్దకు చర్చలకు వెళ్తే..అమరావతి తరలింపుకు తాము సైతం సిద్దంగా ఉన్నామనే సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయం కొందరు రైతులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుండి అధికారికంగా ఆహ్వానం వస్తే ఆలోచన చేయాలని మరి కొందరు భావిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.