హైకోర్టులో మంత్రి కొడాలి నాని పిటిషన్.. ఎస్ఈసీ నిమ్మగడ్డ షోకాజ్ నోటీస్ ను సవాల్ చేస్తూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు వైసీపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య ఆధిపత్య పోరు గా మారిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం, దానికి ఎస్ఈ సి నిమ్మగడ్డ నోటీసులు జారీ చేయడం, ఆపై వారు కోర్టులను ఆశ్రయించడం ఇదే తంతు కొనసాగుతోంది.
ఘర్షణల నడుమ కొనసాగుతున్న రెండోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ .. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇదే
ఎస్ఈసి ఆదేశాలపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని కొడాలి నానీ నిర్ణయం
ఇక తాజాగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు కొడాలి నాని మీడియా సమావేశాల్లో మాట్లాడొద్దని కొడాలి నాని పై చర్యల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు . ప్రస్తుతం కోర్టుకు సెలవులు ఉన్న కారణంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని మంత్రి నిర్ణయం తీసుకున్నట్లు గా సమాచారం.
ఈ నెల 21వ తేదీ వరకు మీడియాతో మాట్లాడవద్దని కొడాలి నాని పై ఆంక్షలు
పంచాయతీ ఎన్నికలు మొదలైన నాటి నుండి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మొదట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీరియస్ గా స్పందించిన ఎస్ఈసి ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ఎమ్మెల్యే జోగి రమేష్ కు నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇక తాజాగా మంత్రి కొడాలి నాని కి షోకాజ్ నోటీసులు జారీ చేసి, తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అంతేకాకుండా ఈ నెల 21వ తేదీ వరకు మీడియాతో మాట్లాడవద్దని కొడాలి నాని పై ఆంక్షలు విధించారు
.
కొడాలి నానీ వ్యాఖ్యలతో సీరియస్ అయిన ఎస్ఈసి .. షోకాజ్ నోటీసు, ఆంక్షలు
ముఖ్యమంత్రి పతనాన్ని ఎస్ఈసి కోరుతోంది అంటూ మంత్రి కొడాలి నాని కామెంట్లు చేయడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనపై చర్యలకు ఉపక్రమించారు . రాష్ట్ర అధినేతగా సీఎం మీద కమిషన్ కు సంపూర్ణ గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు మీడియాతో మాట్లాడే అంశంలో కొడాలి నాని పై ఆంక్షలు విధించారు. సమావేశాలలో నిగ్రహం పాటించాలని, సంయమనంతో వ్యవహరించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు.
సమాధానం ఇచ్చిన కొడాలి నాని , షోకాజ్ పై అభ్యంతరం తో కోర్టును ఆశ్రయిస్తున్న మంత్రి
గ్రామీణ ప్రాంతాలలో రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ఆపడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై కొడాలి నాని విమర్శించారు. కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టిన గంటలోపే ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. సాయంత్రం ఐదు గంటల లోపు వివరణ ఇవ్వాలని కొడాలి నానికి షోకాజ్ నోటీసు జారీ చేయగా, అందుకు రెండు గంటల ముందే వివరణ ఇచ్చారు కొడాలి నాని. ఎస్ఈసి తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని కొడాలి నాని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలను సవాలు చేస్తూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు కొడాలి నాని.