బిజెపి చీకటి రాజకీయాలు...తెలంగాణాలో టిఆర్ఎస్ తో కలిసి దొంగ నాటకాలు:మంత్రి కొల్లు రవీంద్ర
కర్నూలు:ఎపి సిఎం చంద్రబాబుకు ఒక కేంద్ర సంస్థ నుంచి నోటీసులు రాబోతున్నాయంటూ సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
దీంతో టిడిపి మంత్రులు, నేతలు బిజెపి తీరును తప్పుబడుతూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం చీకటి రాజకీయాలు చేస్తూ...తెలంగాణాలో టిఆర్ఎస్ తో కలిసి దొంగ నాటకాలు ఆడుతోందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. జగన్, పవన్ కల్యాణ్తో కలిసి ఆ పార్టీ ఏదో సాధించాలని ప్రయత్నిస్తోందని మంత్రి కొల్లు విమర్శించారు.
శనివారం కొల్లు రవీంద్ర దంపతులు శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి కొల్లు మీడియాతో మాట్లాడారు. కేంద్రం సహకరించకపోయినా వృద్ధి రేటు 11.50 శాతం సాధించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేశారని ప్రస్తుతించారు. గత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోన్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి కొల్లు చెప్పుకొచ్చారు.
అలాగే విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం తమ ప్రభుత్వం అమరావతిలో హైకోర్టును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొల్లు తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి భవన నిర్మాణాలు పూర్తైతే హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని మంత్రి కొల్లు తెలిపారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వడంతోపాటు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ, ఉపాధి ఇస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు.
ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రలో సెల్ఫీలు దిగుతూ కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతిని జాతీయ, అంతర్జాతీయ క్రీడా నగరాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. తాము ప్రతి నియోజకవర్గంలో రూ.2 కోట్లతో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో మండల స్థాయిలో ఎన్టీఆర్ క్రీడా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉపాధి నిధులతో 10 వేల స్కూల్ గ్రౌండ్ లను అభివృద్ధి చేస్తామన్నారు. గాండీవం కార్యక్రమంలో 100 ప్రాంతాల నుంచి లక్షన్నర మంది విద్యార్థులను స్క్రీనింగ్ చేసి 50 వేల మంది విద్యార్థులకు అంతర్జాతీయ క్రీడా నిపుణులతో శిక్షణ ఇప్పించి ఒలింపిక్ పోటీలకు పంపనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు.