పన్ను చిచ్చు: మంత్రి మహేందర్ వాదన, కోర్టుకు కేశినేని, జెసి ఫైర్
హైదరాబాద్: పన్నుల వసూలును డిసెంబర్ నుంచే అమలు చేయాల్సి ఉన్నా.. ఆంధ్రా నేతలు మార్చి 31 వరకు తీసుకొచ్చారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఏప్రిల్ 1 నుంచి పన్ను వసూలు చేయడం జరుగుతుందని తేల్చి చెప్పారు.
తెలంగాణలోని వాహనాలకు కూడా పన్ను ఛార్జీలు పడతాయని, తాము వారికి నచ్చజెప్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే 9 నెలలపాటు పన్ను వసూలు చేయకపోవడంతో సుమారు 40 కోట్ల నష్టం వాటిల్లిందని మహేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ కావాలని పన్నులు వసూలు చేయడం లేదని, చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం 43జీవో ప్రకారం ముందుకెళ్తోందని చెప్పారు. కొత్త రాష్ట్రాలుగా ఏర్పడితే సాధారణంగా పన్నులు వసూలు చేయడం జరుగుతుందని చెప్పారు. పన్ను విషయంపై ఏపి మంత్రులు కూడా తనతో మాట్లాడారని తెలిపారు. ఏపి ప్రైవేటు వాహన యజమానులు కోర్టుకు కూడా వెళ్తున్నట్లు తెలిసిందని చెప్పారు. అయితే తెలంగాణ ప్రభుత్వం చట్ట ప్రకారమే నడుచుకుంటోందని మహేందర్ రెడ్డి చెప్పారు.
కోర్టును వెళ్తాం: ఎంపి కేశినేని
వాహనాలపై పన్ను పెంపు అంశంపై తెలంగాణ సర్కారు నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని ఏపికి చెందిన ఎంపి కేశినేని నాని చెప్పారు. ఏపి కంటే తెలంగాణలోనే ప్రైవేటు ఆపరేటర్లు ఎక్కువగా ఉన్నారని, పన్ను పెంపుతో తెలంగాణ ఆపరేటర్లు కూడా నష్టపోతారని చెప్పారు. విభజన చట్టం ప్రకారం కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు.
జెసి ప్రభాకర్ ఫైర్
తెలంగాణ ప్రభుత్వం పెంచిన పన్నుల వల్ల ప్రజలపై భారం పడుతుందని ఏపి తెలుగుదేశం నేత, ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ అన్నారు. పన్ను పెంపు సరైన నిర్ణయం కాదని మండిపడ్డారు. తెలంగాణ ప్రైవేటు బస్సులు లేవని, 90శాతం బస్సులు ఏపిలోనే ఉన్నాయని చెప్పారు. వాహనాల పన్నులను విభజన నిష్పత్తిలోనే పంచుకోండి. ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఉమ్మడి రాజధాని అని పన్నులు వేయడం సరికాదని అన్నారు. వసూలు చేసిన పన్నును కూడా పంచాలని, తెలంగాణకు 48శాతం, ఏపికి 52శాతం పన్ను కడతామని అన్నారు.
కాగా, పన్ను పెంపు కారణంగా తెలంగాణ, ఏపి సరిహద్దులోనే లారీలు ఆగిపోయాయి. అంతకుముందే రవాణా పన్ను వ్యతిరేకిస్తూ బస్సులను ప్రైవేటు ట్రావెల్స్ నిలిపేశాయి. కాగా, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఏపి నుంచి వచ్చే వాహనలు పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెక్ పోస్టు సిబ్బంది తెలిపారు.
ఇది ఇలా ఉండగా ఏపి ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని వేణుగోపాలచారి చెప్పారు. రాష్ట్ర ఆదాయం కోసమే పన్నుల పెంపు నిర్ణయమని తెలిపారు.