కారణం అదే: చంద్రబాబు భేటీకి కాపు మంత్రి మాణిక్యాలరావు గైర్హాజరు?
అమరావతి: కాపు రిజర్వేషన్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగలనుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్తో నిర్వహించిన కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారడంతో ఏపీ మంత్రివర్గ సమావేశం విజయవాడలో సోమవారం జరుగుతుంది.
అందుబాటులో ఉన్న మంత్రులతో పాటు కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరయ్యారు. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో నలుగురు కాపు నేతలు ఉన్నారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటు నారాయణ, గంటా శ్రీనివాసరావు, పైడికొండల మాణిక్యాలరావులు ఉన్నారు
ఈ నలుగురితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించినప్పటికీ... దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గైర్హాజరయ్యే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి మాణిక్యాలరావు రాజకీయ గురువు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సోమవారం కిర్లంపూడి వెళ్లి ముద్రగడను కలిశారు.
దీనిని బట్టి కాపు ఐక్య గర్జనకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మద్దతు ఉన్నట్లే కాపు నేతలు భావిస్తున్నారు. కాపులను బీసీల్లో చేర్చడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదని, బీసీల్లో చేర్చితే బీసీ నేతలు సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తారనే విషయాన్ని సీఎం చంద్రబాబు మొదట నుంచి చెప్తూనే ఉన్నారు.
ఇప్పడు అదే విషయాన్ని కాపులకు అర్ధమయ్యేలా చెప్పేందుకు మంత్రులను ముందుంచి, తాను చెప్పదలచుకున్న విషయాన్ని వాళ్లతో చెప్పించాలని సీఎం ప్రయత్నిస్తున్నారని సమాచారం అందడంతోనే మంత్రి మాణిక్యాలరావు గైర్హాజరుకి కారణమని తెలుస్తోంది.
మరోవైపు సోమవారం సాయంత్రంలోగా కాపులను బీసీల్లో చేరుస్తూ జీవోను విడుదల చేయాలని, లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అదివారం ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి అత్యవసర మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇది ఇలా ఉంటే, టీడీపీలోని బీసీ మంత్రులు కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు మార్చిలో ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్లో బీసీ కమిషన్కు భారీ మొత్తంలో నిధులు కేటాయించి వారిని సంతృప్తి పరిచేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.