దుర్గగుడిలో అపచారం: విచారణకు ఆదేశం, పాలకమండలిపై మంత్రి సీరియస్
విజయవాడ: మంగళవారం దుర్గగుడిలో చోటు చేసుకున్న అపచారంపై ఏపీ దేవాదయశాఖ మంత్రి మాణిక్యాలరావు స్పందించారు. సతీసమేతంగా దుర్గమ్మను మంత్రి మాణిక్యాలరావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమ్మవారి నైవేద్యం ఆలస్యం ఘటన తన దృష్టికి వచ్చిందన్నారు.
ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. భక్తులకు అసౌకర్యం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. వికలాంగులకు అసౌకర్యం కలిగినట్లు భక్తులు ఫిర్యాదు చేశారన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మాస్టర్ప్లాన్ను సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు.
అన్నప్రసాద కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించారు. అమ్మవారి లడ్డూ ప్రసాదం పోటులో పురుగులు, కీటకాలతో అపరిశుభ్రంగా ఉందంటూ సోమవారం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయాన్ని పరిశీలించిన ఆయన అన్నదానంపై భక్తులను అడిగి వివరాలను తెలుసుకున్నారు.
దుర్గగుడి ఆలయానికి ఎలాంటి పాలకమండలిని నియమించలేదని ఆయన స్పష్టం చేశారు. పాలకమండలిపై పత్రికల్లో వార్తలు రాశారని, కానీ అది నిజం కాదన్నారు. పాలకమండలి ఏర్పాటుపై తనకు తెలియని సబ్జెక్టు మాట్లాడతున్నారన్నారు. పత్రికల్లో వస్తే తనకు సంబంధం లేదు కదా? అని ప్రశ్నించారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ ఆలయాన్ని శోభాయమానంగా మారుస్తామన్నారు. ఇదిలా ఉంటే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం దుర్గమ్మ ఆలయ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అమ్మవారికి నివేదన సమర్పించే సమయంలో వీఐపీ భక్తులు గర్భాలయంలో ఉన్నారు.
దీంతో వీఐపీ భక్తులు బయటకు వచ్చేవరకు అమ్మవారికి నివేదనను అధికారులు నిలిపివేశారు. అమ్మవారికి నివేదన నిలిపివేయడం మంచిది కాదని వైదిక కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పించే సమయంలో ఎంతటి వీఐపీలకు అయినా దర్శనాన్ని నిలిపివేసి ఆ క్రతువును పూర్తి చేయాలన్నారు.
అయితే అందుకు భిన్నంగా దుర్గ గుడిలో అధికారులు వ్యవహరించడం సరైనది కాదని వైదిక కమిటీ ఆక్షేపించారు. వైదిక కమిటీ ఆగ్రహంతో గర్భాలయంలోని వీఐపీలను బయటకు పంపించివేసి అమ్మవారికి నివేదన సమర్పించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మ వారికి ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నివేదన సమర్పిస్తారు.
దుర్గగుడి ఆలయ సూపరింటెండెంట్పై సస్పెన్షన్ వేటు
విజయవాడ దుర్గ గుడి అమ్మవారికి నైవేద్యం ఆలస్యం కావడంపై ఆలయ ఈవో సూర్యకుమారి సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో నైవేద్యం సమయంలో విధుల్లో ఉన్న ఆలయ సూపరింటెండెంట్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశించారు. ఏఈఓ, ఇన్స్పెక్టర్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.