నా తప్పేంటి, ఏపీలో తిడ్తున్నారు: కేంద్రమంత్రి, జగన్ ధర్నామంచిదే: బిజెపి మంత్రి
న్యూఢిల్లీ/విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో లేదని రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి ప్రకటించారు. గురువారం నాడు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా దాదాపు అదే ప్రకటన చేశారు. అంతకు వారం ముందు కేంద్రమంత్రి హెచ్పీ చౌదరి కూడా హోదాపై తేల్చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రుల ప్రకటన పైన ఏపీ ప్రజలు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. ఏపీకి ఎందుకు హోదా ఇవ్వడం లేదని వివరించిన కేంద్రమంత్రి జయంత్ సిన్హా పైన బెదిరింపుల స్థాయిలో విమర్శలు వస్తున్నాయని అంటున్నారు.
సోషల్ మీడియాల ప్రజలు కేంద్రమంత్రుల పైన తిట్లు, బెదిరింపులకు దిగుతున్నారు. ఆ సందేశాల పైన కేంద్రమంత్రి జయంత్ సిన్హా వరకు వెళ్తున్నాయని, ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. చట్టంలో ఉన్నదే నేను చెప్పానని, నేనేం తప్పు చేశానని, ఏపీకి రావొద్దనే విధంగా హెచ్చరికలు ఉన్నాయని ఆవేదన చెందుతున్నారంటున్నారు.
జగన్ ధర్నాను స్వాగతించిన బిజెపి మంత్రి
తెలంగాణలో ఆ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షను ఏపీ మంత్రి, బిజెపి నేత మాణిక్యాల రావు స్వాగతించారు. జగన్ చేపట్టనున్న ధర్నా స్వాగతించదగ్గదే అన్నారు.
జగన్ ధర్నా చేయడం వల్ల ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మిత్రధర్మం మేరకు తమ నిర్ణయాలకు మద్దతు తెలపాల్సిన తెలుగుదేశం పార్టీ.. ప్రత్యేకహోదా విషయంలో తమను దోషిని చేయడం, టీడీపీ నేతలు నేరుగా బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టడంతో ఆయన జగన్కు మద్దతు పలికేలా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.