రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాపై మంత్రి మేకపాటి కీలక వ్యాఖ్యలు... తొలి ప్రాధాన్యత ఏపీకే...
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాక్సిన్ కొరత లేదని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో తయారయ్యే ఆక్సిజన్ విషయంలో రాష్ట్రానికే తొలి ప్రాధాన్యత అన్నారు. రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తామన్నారు. మెడికల్ ఆక్సిజన్ సప్లైపై క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం నిఘా ఉందన్నారు. ఆక్సిజన్ సప్లైపై గురువారం(ఏప్రిల్ 22) మంత్రి సమీక్షా సమావేశం జరిపారు.
ప్రస్తుతం ఏపీలో 40 రకాల పరిశ్రమల ద్వారా 510 యాంటీ మెడికల్ ఆక్సిజన్ తయారీ జరుగుతోందన్నారు. రోజూ 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు యుద్ద ప్రాతిపదికన ఆక్సిజన్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
గతేడాది కరోనా మొదటి వేవ్ సందర్భంగా రాష్ట్రంలో ఆక్సిజన్ వినియోగం,ప్రస్తుతం ఎంత ఆక్సిజన్ అవసరం వంటి అంశాలపై పరిశ్రమల శాఖ డైరెక్టర్ తాజా సమీక్షా సమావేశంలో ప్రజేంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ వినియోగం,ఉత్పత్తి,అవసరాలపై చర్చించారు.
ప్రస్తుతం విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోన్న సంగతి తెలిసిందే. పరిశ్రమ అవసరాల కోసం ఉత్పత్తి చేసే ఆక్సిజన్ను ఇప్పుడు మెడికల్ అవసరాలకు వినియోగిస్తున్నారు. రోజుకు సగటున 2600 టన్నుల ఆక్సిజన్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడినుంచి ఆక్సిజన్ సరఫరా చేసేలా రైల్వే శాఖ ముందుకొచ్చింది. ముంబైలోని కలంబోలి నుంచి ఇప్పటికే ఖాళీ ట్యాంకర్లతో కూడిన రైలు విశాఖ చేరింది. మొత్తం ఏడు ట్యాంకర్లలో 105 టన్నుల ఎల్ఎంవో(లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్)ను తరలించనున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రోజుకు 100 టన్నుల ఎల్ఎంఓని తీసుకెళ్తే... దాని ద్వారా 10వేల సిలిండర్లు నింపవచ్చునని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయించిన ఈ ప్లాంట్ ఆపద కాలంలో మెడికల్ అవసరాలకు ఉపయోగపడుతుండటం చర్చనీయాంశంగా మారింది.