ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న మంత్రి అమర్నాథ్ రెడ్డి
చిత్తూరు: కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పలు సమావేశాలలో ప్రసంగించిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి దానిని నిజమని నిరూపించారు. శనివారం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా శ్రమించడంతో పాటు, గత వారం రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్న ఆయనకు ఇన్ఫెక్షన్ కారణంగా కారబంకల్కు గురయ్యారు. అయితే విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ అక్కడ ఆపరేషన్ చేయించుకోలేదు. స్వస్థలం పలమనేరు చేరుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకున్నారు. దీంతో అక్కడి వైద్యులు, సిబ్బంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మంత్రి నిర్ణయంపై వారు హర్షం వెలిబుచ్చారు.
ప్రభుత్వ ఆసుపత్రుల వైపు చూడని ఎంతోమందికి మంత్రి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మంత్రిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలను వినియోగించుకోవాలని వైద్యులు, సిబ్బంది కోరారు. నేడు ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండడంతో పాటు అనుభవజ్ఞులైన డాక్టర్లు పని చేస్తున్నారని, దీంతో మెరుగైన సేవలను అందిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోవడానికి మంత్రి ముందుకు రావడాన్ని అందరూ స్వాగతించాల్సిన అంశం అన్నారు. ప్రజలలో ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత నమ్మకాన్ని కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపాలని వైద్యులు పిలుపునిచ్చారు.
ప్రభుత్వాస్పత్రిలో మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆపరేషన్ చేయించుకున్నారనే విషయం తెలిసి స్థానికులు కూడా విస్మయపోయారు. మంత్రి వెంట మంత్రి సతీమణి రేణుకా రెడ్డి, పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటిండెంట్ వీణా కుమారి, వైద్యులు హరగోపాల్, శారదా, సిబ్బంది తదితరులు ఉన్నారు.