చిత్తశుద్ధి ఉంటే...అన్ని పార్టీలు అఖిలపక్షానికి వస్తాయి:మంత్రి నక్కా
అమరావతి :రాష్ట్రం పట్ల నిజంగా చిత్త శుద్ధి ఉంటే రేపు జరగబోయే అఖిలపక్షం సమావేశానికి అన్నిపార్టీలు వస్తాయని మంత్రి నక్కా ఆనంద్బాబు అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక హోదా కోసమనే పేరుతో వైసిపి ఎంపీల డ్రామా చివరి అంకానికి చేరుకుందని, అలాగే విజయసాయిరెడ్డితో కూడా రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో బ్రోకరేజ్ చేయడానికే రాజ్యసభ ఎంపిలతో రాజీనామా చేయించటం లేదని మంత్రి నక్కా ఆరోపించారు. బిజెపితో లాలూచీలో భాగంగానే ఈడి జప్తు చేసిన ఆస్తులను కుడా విడుదల చేస్తున్నారని ప్రజలు గమనించాలన్నారు.
వైఎస్ జగన్ తన కూతురుని కలవటానికి అని చెప్పి లండన్ వెళుతూ విజయ్ మాల్యాని కలుస్తున్నాడని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. మోడీకి అనుకూలంగా లేని లాలూ, ఇతర నేతలను త్వర త్వరగా జైలుకి పంపుతున్నారని అన్నారు. వైసిపి నేతల కేసులు మాత్రం అంగుళం కూడా ముందుకు పోవటం లేదన్నారు. ఇదే లాలూజీకి నిదర్శనమన్నారు.
మరోవైపు వైసిపి నేతలు జగన్, విజయసాయి రెడ్డిపై మంత్రి జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 420కి కేరాఫ్ అడ్రస్ విజయసాయిరెడ్డి తాతయ్య అని మంత్రి జవహార్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "దొంగలున్నారు జాగ్రత్త"...బోర్డులు తీసేసి జగన్ ఉన్నాడు జాగ్రత్త.. విజయసాయి ఉన్నాడు జాగ్రత్త అనే బోర్డులు పెట్టాలని ఎద్దేవా చేశారు. లండన్ లో జగన్ కూతురుకి షెల్టర్ విజరు మాల్యా ఇచ్చాడని అనుమానం ఉందన్నారు. రాష్టంలో వైకాపా వ్యవహారం చూస్తే...జెండా వైసిపిది...ఎజెండా బిజెపిది అని అర్థమవుతోందన్నారు. పోరాటం చేయలేని వారు కాశ్మీర్ వెళ్లి వైరాగ్యం తీసుకోవటం నయమని మంత్రి జవహర్ సూచించారు.