జేసీ దివాకర్ రెడ్డిని వైసీపీలోకి ఎవరు ఆహ్వానించారు: ఆయనే వస్తానంటున్నారు: మంత్రి నాని ఫైర్..!
టీడీపీ నేత..మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ పైన చేసిన వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని స్పందించారు. వైసీపీలోకి రమ్మంటున్నారని..రాని వాళ్లను టార్గెట్ చేస్తున్నారంటూ జేసీ చేసిన వ్యాఖ్యల మీద ఆయన మండిపడ్డారు. జేసీ దివాకర్ రెడ్డిని వైసీపీలోకి రమ్మని ఎవరు ఆహ్వానించారని ప్రశ్నించారు. ఆయనే వైసీపీలోకి వస్తానంటూ రాయబారాలు పంపుతున్నారని చెప్పుకొచ్చారు.
రాజకీయంగా చివరి దశలో ఉన్న జేసీతో మాకేం పని అంటూ మంత్రి నిలదీసారు. బస్సుల సీజ్ విషయంలో జేసీ అవాస్తవాలు మాట్లాడుతున్నారుని.. బస్సుల సీజ్ విషయంలో సర్కార్ చట్ట ప్రకారమే వ్యవహరిస్తోందని మంత్రి నాని స్పష్టం చేసారు. జేసీ లాంటి వారితో వైసీపీకి అవసరం లేదని స్పష్టం చేసారు.
ముఖ్యమంత్రిపై జేసీ విమర్శలు..
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో కొందరిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. హద్దు మీరి పరిపాలన జరుగుతోందని విమర్శించారు. మైనింగ్పై కూడా కేసులు పెడుతున్నారని చెప్పారు. పార్టీలో చేరమని చెబుతున్నారని.. అలాగైతే కేసులు ఏమీ ఉండవని అంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం చెప్పినట్లు వినాల్సిన పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారన్నారు.
దివాకర్ ట్రావెల్సే
సీఎం చెప్పినట్లు వినకపోతే సీఎస్ను బదిలీ చేసినట్లుగా తమకు జరుగుతుందని అధికారులు భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. 74 సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్లో తనకు అనుభవం ఉందని వివరించారు. ఒక్క దివాకర్ ట్రావెల్సే నిబంధనలు అతిక్రమించిందా.., మిగిలిన వాళ్ల బస్సులు ఎన్ని సీజ్ చేశారంటూ ప్రశ్నించారు. ట్రిబ్యునల్ బస్సులను వదిలిపెట్టమని చెప్పినా ఆర్టీవో అధికారులు విడిచిపెట్టడం లేదంటూ చెప్పుకొచ్చారు.
జేసీ మాటలు అవాస్తవాలు..
జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవాలని మంత్రి పేర్ని నాని సమాధానం ఇచ్చారు. నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న బస్సులను మాత్రమే అధికారుల సీజ్ చేసారని స్పష్టం చేసారు. జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారిని వైసీపీలోకి రావాలని తాము ఆహ్వానించలేదని..అంత అవసరం లేదని తేల్చి చెప్పారు.
ఆయనంతటగా ఆయనే
జేసీ దివాకర్ రెడ్డి ఆయనంతటగా ఆయనే వైసీపీలోకి వస్తానంటూ ముందుకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఎవరి మీద వ్యక్తి గతంగా వ్యవహరించదనివ..ఏది చేసినా చట్ట ప్రకారమే నడుచుంటామని వివరించారు. జేసీ లాంటి వారి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అసవరం లేదన్నారు. ఎవరు చట్టం అతిక్రమించినా చర్యలు తప్పవని స్పష్టం చేసారు.