సీఎంను నోటికొచ్చినట్లు, విజయసాయి క్షమాపణ చెప్పాలి: లోకేశ్ డిమాండ్
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నోటికొచ్చినట్టు మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ2 నిందితుడు విజయసాయిరెడ్డికి చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
తమపై ఉన్న కేసుల మాఫీ కోసం విజయసాయిరెడ్డి తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోడీని నిలదీస్తున్నదెవరో, ఆయన కాళ్లు పట్టుకున్నదెవరో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. తన పక్కన ఏ2 నిందితుడు తిరగడం ప్రధానికే మంచిది కాదని అన్నారు.
అంతేకాదు, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేసిన పార్టీలే చివరికి ఆ సమావేశానికి హాజరుకాకుండా డుమ్మా కొట్టాయని మంత్రి లోకేశ్ విమర్శించారు.
''బీజేపీ, వైసీపీ కుట్రలు బయటపడుతున్నాయి..''
మంత్రి జవహర్ మీడియాతో మాట్లాడుతూ, మోడీ కాళ్లకు మొక్కిన విజయసాయిరెడ్డి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని, బీజేపీ, వైసీపీ కుట్రలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని అన్నారు.
'వైసీపీకి సహకరిస్తామని మోడీ చెప్పినట్టుంది! ఇక విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి పదవి కావాలని అడుగుతారేమో..' అంటూ మంత్రి జవహర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.