"సంపద నుంచి చెత్త సృష్టిస్తా"...మరోసారి పొరపాటుతో టార్గెట్ అయిన లోకేష్
అమరావతి:మంత్రి నారా లోకేశ్ మరోసారి పొరపాటు చేశారు. దీంతో సహజంగానే సోషల్ మీడియాలో టార్గెట్ గా మారారు. వివిధ సందర్భాల్లో పొరబాట్లకు గాను లోకేష్ పై ఇప్పటికే కొన్ని సార్లు సోషల్ మీడియాలో సెటైర్లు పేలగా తాజాగా అటువంటిదే మరో సందర్భం ఉత్పన్నమయింది.
దీనికి స్వచ్ఛతే సేవకు సంబంధించి ఆయన ఫేస్ బుక్ లో పెట్టిన ఒక పోస్ట్ కారణమైంది. గాంధీజయంతి సందర్భంగా మంగళవారం ఏపీ ప్రభుత్వం స్వచ్ఛతే సేవ అనే కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి వివరిస్తూ లోకేష్ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టగా అందులో అటూ ఇటుగా మారిన ఒక వాక్యం విమర్శకులకు లోకేష్ టార్గెట్ అయ్యేలా చేసింది.
గాంధీజయంతి సందర్భంగా చెత్త నుంచి సంపదను సృష్టించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, దీని కోసం గ్రీన్ అంబాసిడర్లను నియమించామని మంత్రి లోకేశ్ పేర్కొంటూ ఈ కార్యక్రమానికి సంబంధించి వివరాలను నారా లోకేశ్ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. అందులో చెత్త నుంచి సంపదను సృష్టిస్తామని చెప్పే క్రమంలో పదాలు అటూ ఇటూ తారుమారు కావడంతో సంపదతో చెత్తను సృష్టిస్తామని అన్నట్లయింది.
దీంతో ఇది చూసిన నెటిజన్లు ఆ పొరబాటుపై వెంటనే స్పందించి కింద కామెంట్లు పెట్టారు. మరోవైపు లోకేష్ తప్పుల కోసమే ఎదురుచూసే విమర్శకులు ఈ అవకాశాన్ని వాడుకుంటూ ఆ పోస్ట్ ను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చి సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. అంతటితో ఆగకుండా గతంలో లోకేష్ ఎప్పుడెప్పుడు పొరపాటు పడ్డారో అవన్నింటినీ ఉదహరిస్తూ వ్యంగాస్త్రాలు, జోకులు సంధిస్తున్నారు.