బిజెపి అంటే....భారతీయ జనతా జగన్ పవన్ కళ్యాణ్ పార్టీ:లోకేష్
పశ్చిమ గోదావరి:బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, జగన్, పవన్కల్యాణ్గా మారిపోయిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అభివర్ణించారు.
పశ్చిమగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా లోకేష్ గ్రామదర్శిని-గ్రామవికాసం కార్యక్రమంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పెనుగొండ, పెనుమంట్ర మండలం నెలమూరులలో ఏర్పాటుచేసిన సభల్లో లోకేష్ మాట్లాడుతూ ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందీ, ఇవ్వకుండా ఆపిందీ ప్రధాని మోదీనే నని... కానీ జగన్ ఆయనని పల్లెత్తు మాట అనరని...పైగా రాష్ట్రాభివృద్ధికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్న తమ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఆడిపోసుకుంటారని ధ్వజమెత్తారు.
వైకాపా ఎంపీలు నాటకీయంగా రాజీనామాలు చేసి, భాజపాతో రాజీ పడ్డారని లోకేష్ ఆరోపించారు. టిడిపి ఎంపీలు లోక్సభలో పోరాడుతున్నారు...వైసిపి ఎంపిలు అడ్రస్ లేరన్నారు...వైసిపి, బిజెపిలకు ఇప్పుడు పవన్కల్యాణ్ తోడయ్యారని...ఇంతవరకు మనతోనే ఉండి, ఇపుడు మనపైనే విమర్శలు చేస్తున్నారన్నారు. తనపై ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలని పవన్ కు సవాల్ విసిరితే సమాధానం లేదని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో రూ.22 వేల కోట్ల తో ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని చెప్పారు. అలాగే మున్ముందు ప్రతి పేదకుటుంబానికి సురక్షిత మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు.