రేపు ఎమ్మెల్యే కిడారి, సివేరి కుటుంబాలకు మంత్రి లోకేష్ పరామర్శ
అమరావతి:మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురయిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా కుటుంబాలను శుక్రవారం మంత్రి నారా లోకేష్ పరామర్శించనున్నారు.
ఈ మేరకు మంత్రి లోకేష్ రేపటి విశాఖ జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మావోయిస్టుల దాడిలో చనిపోయిన ఎమ్మెల్యే కిడారి, సివేరి కుటుంబాలను కలవడమే ప్రధానం లక్ష్యంగా లోకేష్ విశాఖ జిల్లా పర్యటన జరగనుంది. సిఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ విశాఖ పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబాలను అమెరికా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఫోన్ ద్వారా పరామర్శించారు. ఎమ్మెల్యే కిడారి సతీమణి పరమేశ్వరి, సోమ సతీమణి సివేరి ఇందుతో మాట్లాడిన చంద్రబాబు...ప్రభుత్వం, పార్టీ పారంగా రెండు కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
కిడారి, సోమ హత్య ను తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కిడారి, సోమ బిడ్డలకు అన్ని విధాలా అండగా ఉంటామని, వారి ఆశయ సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అని న్యూజెర్సీ ఎన్నారై సభలో పేర్కొన్నారు. ఇది హేయమైన చర్యని.. దాడులు, హత్యలు ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చగా పేర్కొన్నారు.
ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యే లను మావోయిస్టులు హతమార్చిన క్రమంలో ఈ దాడికి కారణంగా భావిస్తున్న క్వారీ వివాదంలో మంత్రి నారా లోకేష్ పేరు వినిపించడం, గిరిజన నేతలు హత్యకు గురైనా లోకేష్ పరామర్శించకపోవడంపై విమర్శలు చోటుచేసుకుంటుండటంతో వాటికి చెక్ పెట్టేందుకు లోకేష్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈ పరిస్థితుల్లో లోకేష్ అక్కడ పర్యటించడం రిస్కేననేది వారి విశ్లేషణ.