ఒప్పుకుంటేనే: రాజధానిపై నారాయణ, చేయి కలిపిన మేకపాటి, 'బాబు సిఎం కాదు సీఈవో'
అనంతపురం/విజయవాడ: రైతులు అంగీకరిస్తేనే గ్రామాల మధ్యలో రహదారులు వేస్తామని మంత్రి నారాయణ బుధవారం చెప్పారు. అమరావతి మాస్టర్ ప్లాన్లో ఆరు గ్రామాల మధ్యలో నుంచి రహదారుల నిర్మాణంపై ఆయన స్పష్టత ఇచ్చారు.
మాస్టర్ ప్లాన్లో సమాంతర రోడ్లకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఆరు గ్రామాల్లో 3 కిలోమీటర్ల రోడ్ల పైన అభ్యంతరాలు వచ్చాయని, రైతులు ఒప్పుకుంటేనే గ్రామాల మధ్య నుంచి రోడ్లు వేస్తామని చెప్పారు. లేకుంటే రోడ్లను పక్కకు మళ్లిస్తామన్నారు.
జరీబు భూముల రైతులకు జరీబు భూముల్లోనే, మెట్ట ప్రాంతం వారికి మెట్ట ప్రాంతంలోనే ప్లాట్లు కేటాయిస్తామని చెప్పారు. మాస్టర్ ప్లాన్ను సిఆర్డీఏ వెబ్సైట్లో ఉంచుతామని చెప్పారు. గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ్ మండపంలో రాజధాని మాస్టర్ ప్లాన్ పైన అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఫ్లెమ్మింగో ఫెస్టివెల్లో నారాయణ, మేకపాటి
నెల్లూరు నగర శివారులో బుధవారం ఉదయం ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట జరిగిన 2కే రన్ కలర్ ఫుల్గా సాగింది. ట్రాక్ సూట్ వేసిన మంత్రి నారాయణ యువతతో కలిసి రోడ్డుపై పరుగులు పెట్టారు. ఇక ఈ ఫెస్టివల్లో ఓ అరుదైన దృశ్యం కనిపించింది.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వైసిపి సీనియర్ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మంత్రి నారాయణతో కలిసి మీడియా కెమెరాల ముందు తళుక్కుమన్నారు. నారాయణతో కరచాలనం చేసిన మేకపాటి కార్యక్రమంలో పాల్గొన్నారు.
చంద్రబాబుపై శైలజానాథ్ ఆగ్రహం
చంద్రబాబు ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శైలజానాథ్ బుధవారం మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా కాకుండా సీఈవోగా పాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. పానలో లోపాలను చంద్రబాబు స్వయంగా సమీక్షించుకోవాలన్నారు. కేంద్రం నుంచి నిధులు తేలేక విరాళాలు సేకరిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రన్న కానుక, ఇసుక మాఫియాల పైన విచారణ జరిపించాలన్నారు. చంద్రన్న కానుక సరుకుల్లో నాణ్యత లేదన్నారు. రహస్య ఏజెంట్ మంత్రి నారాయణ శాఖలో అవినీతి పెరిగిందని ఆరోపించారు అమరావతికి పెట్టిన ఖర్చంత కూడా పెట్టుబడులు రాలేదన్నారు.