అమరావతిపై ఆర్కిటెక్చర్స్తో మంత్రి, సీడ్ క్యాపిటల్లో బిజినెస్ ప్లాన్!
విజయవాడ: అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ఇతర నిర్మాణాల డిజైన్ల పైన చర్చించేందుకు మంత్రి నారాయణ సోమవారం నాడు సీఆర్డీఏ అధికారులు, ప్రఖ్యాత ఆర్కిటెక్ నిర్మాణ రంగ సంస్థలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు.
ప్రఖ్యాత ఆర్కిటెక్ నిర్మాణ సంస్థలతో మంత్రి నారాయణ విజయవాడలోని గేట్ వే హోటల్లో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడారు. అష్టాదశ పీఠాల తరహాలో 7 మిషన్లకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ఉంటుందని చెప్పారు. 2019 నాటికి మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుందన్నారు.
ప్రజల మనోభావాలు ప్రతిబింబించేలా అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మిస్తామని చెప్పారు. తాత్కాలిక సచివాలయం జూన్ 20వ తేదీలోగా పూర్తి చేస్తామన్నారు. మూడు వారాల్లో డిజైన్లు ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు.
మాకీ కంపెనీ కొనసాగింపు పైన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాజధాని భవనాల డిజైన్ పూర్తయ్యాకే నిర్మాణాలు ఉంటాయని, ఒకేచోట ఉంటాయన్నారు. ప్లాట్ల కేటాయింపు గడువు పొడిగిస్తామని చెప్పారు. భవనాల ఎఫ్ఎస్ఐ పెంపు వల్ల జనసాంధ్రత పెరుగుతుందని, దానికి తగ్గట్లే ఏర్పాట్లు ఉంటాయన్నారు.
ప్రజలందరూ మెచ్చేలా రాజధాని భవనాలు ఉండాలన్నారు. అమరావతి రాజధాని పరిపాలన భవనాలు ఎలా ఉండాలన్న దానిపై సీఆర్డీఏ ప్యానల్ ఆర్కిటెక్తో చర్చించామని చెప్పారు.
దీనిపై మూడు వారాల్లో 8 సంస్థలు తమ డిజైన్లు సమర్పించనున్నాయన్నారు. మాకీ అసోసియేట్స్ ఆకృతులను ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా కొత్త డిజైన్లు రూపొందించాలని వారిని కోరామన్నారు.
అమరావతిలో ప్రధాన ప్రాంతంగా రూపుదిద్దుకోనున్న సీడ్ క్యాపిటల్ పరిధిలో పెద్ద ఎత్తున ఆహార పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు సీడ్ క్యాపిటల్ ప్రాంతాన్ని వ్యాపారాభివృద్ధికి అనుగుణంగా 8 జోన్లుగా విభజించి తదననుగుణ కార్యాచరణను చేపట్టనున్నట్టుగాతెలిసింది.
ఇందుకోసం ఇప్పటికే పశు సంవర్ధక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించారని తెలుస్తోంది. రాజధానిలో మూడు గ్రామాల మధ్యలో రానున్న సీడ్ క్యాపిటల్ ప్రాంగణంలో దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భవనాల సముదాయాన్ని నిర్మించడానికి సీఆర్డీఏ ఇప్పటికే నిర్మాణ కంపెనీలు ప్రతిపాదించిన డిజైన్లపై తీవ్ర కసరత్తు చేస్తోంది.
రాజధానిలో అత్యంత కీలకంగా ఉండే రాజ్ భవన్, శాసనసభ, సచివాలయం, హైకోర్టు, ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రుల కార్యాలయాలు, క్వార్టర్లు, శాఖాధిపతుల కార్యాలయాలు, ఉద్యోగుల కార్యశాలలు, నివాస ప్రాంగణాలు సీడ్ పరిధిలోకి రానున్నాయి.
దీంతో సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో అధికారికంగా దాదాపు పదిహేను వేల మందికి పైగా ఉద్యోగులు, ఇతరులు విధులు నిర్వర్తించే అవకాశముంటుంది. వీరిలో దాదాపు పదివేల మందికి అవసరమైన నివాస వసతిని కూడా ప్రభుత్వం ఇక్కడ కల్పించనుంది.
ఆహార సరఫరాకు సంబంధించిన అవసరాలు తీర్చడం కోసం సీడ్ క్యాపిటల్ ప్రాంగణంలో ఎనిమిది జోన్లలో ప్రత్యేకంగా వ్యాపార సంస్థలు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసి సీడ్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసే విధంగా అధికారులు రూట్ మ్యాప్ను సిద్ధం చేశారని తెలుస్తోంది.
రాజధాని నిర్మాణం జరగనున్న 29 గ్రామాల్లో ఉన్న పశుసంపద, కోళ్ల ఫారాల నుంచి ఆహార సంబంధిత పదార్ధాలను సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో వసతి పొందే వారికి సరఫరా చేసేందుకు సేకరించనున్నారు. నిత్యం ఆయా గ్రామాల నుంచి వచ్చే ఉత్పత్తులను సేకరించి సీడ్ క్యాపిటల్లో ఎనిమిది జోన్లలో ఏర్పాటు చేయనున్న శీతల గిడ్డంగుల్లో నిల్వ చేయనున్నారు.
సీడ్ క్యాపిటల్లో వచ్చే ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణం 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేసే విధంగా సీఆర్డీఏ ముందుకెళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో సీడ్ నిర్మాణం పూర్తైన త్వరలోనే చుట్టుపక్కల రాజధాని గ్రామాల్లోని స్థానికులకు తగిన ఉపాధి అవకాశాలను పెంపొందింపజేయాలని భావిస్తున్నారు.