'నారా లోకేష్ తండ్రిలాగే రాజకీయ బుద్ది బయటపెట్టుకున్నారు'
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఇటీవల మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్పై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. వరుస వీడియోలతో టీడీపీ యువనేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళా దళిత డాక్టర్కు అన్యాయం జరిగినట్లు లోకేష్ విమర్శలు గుప్పించగా, దీనికి కౌంటర్గా వరుసగా సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో వీడియోలు పోస్ట్ చేశారు. స్వయంగా నారాయణస్వామి కూతురు కూడా ఈ ఘటనపై స్పందించారు. సదరు మహిళా డాక్టర్ విధులకు సంబంధించిన ఫైల్ను చూడాలని సూచించారు.
ఈ ఏడాది మార్చి 22న పెనమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భరత్ అనే వ్యక్తి వైద్యం కోసం వచ్చాడు. డాక్టర్ అనితా రాణి అతనికి వైద్యం చేయకపోగా, తలుపులు వేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత కులం పేరుతో దూషించినట్లు అనితా రాణి.. భరత్పై ఫిర్యాదు చేశారు. భరత్ కూడా వైద్యసేవలు అందించలేదని ఫిర్యాదు చేశాడు. ఏం జరిగిందో నిజానిజాలు తేల్చాలని సీఎం జగన్ ఈ కేసును సీఐడీకి అప్పగించారు.
ఇదిలా ఉండగా, ఈ రోజు భరత్కు మాట్లాడిన రెండు వీడియోలు ట్విట్టర్లో పోస్టు చేశారు. ఓ కేసులో తాను అనితారాణిపై ఉద్దేశ్యపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, అలాగే ఆమెను కులం పేరుతో దూషించలేదని, వైద్యం అందించలేదని ఫిర్యాదు చేశానని భరత్ ఓ వీడియోలో చెప్పారు. మేడం మీపై వ్యక్తిగత కక్ష లేదన్నారు. మరో వీడియోలో భరత్ మాట్లాడుతూ.. జనతా కర్ఫ్యూ రోజు తనకు గాయమైతే ఆసుపత్రికి వెళ్లగా అనితారాణి మేడం తలుపులు వేసుకున్నారని, దీంతో తాము ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆ తర్వాత తమపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని తెలిసిందని, దీంతో డాక్టర్ వద్దకు వెళ్లి ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని కూడా కోరామని పేర్కొన్నారు.
నారాయణస్వామి ఈ రెండు వీడియోలు పోస్ట్ చేసి నారా లోకేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరు అన్న మీ నాన్నతో ఎప్పుడు క్షమాపణ చెప్పిస్తావని ప్రశ్నించారు. అలాగే, వైద్యం కోసం వచ్చిన సామాన్యుడికి వైద్యం చేయకపోగా దౌర్జన్యం చేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి కులం కార్డు తగిలించి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, లోకేష్ కూడా అదే నీచ రాజకీయ బుద్ది బయట పెట్టుకున్నారన్నారు. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేయదు కదా అని పేర్కొన్నారు.