ఈ పరిస్థితి ఎవరికీ రావొద్దు: ఏడ్చిన మంత్రి నారాయణ, కొడుకుతో చివరి మాటలివే..
తన తనయుడు నిషిత్ నారాయణ పార్థివ దేహాన్ని చూసి మంత్రి నారాయణ కన్నీటి పర్యంతమయ్యారు.
నెల్లూరు: తన తనయుడు నిషిత్ నారాయణ పార్థివ దేహాన్ని చూసి మంత్రి నారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. తనయుడి మరణవార్త వినేసరికి ఇంగ్లాండ్లో ఉన్న ఆయన అర్ధంతరంగా తన పర్యటనను ముగించుకుని గురువారం వేకువజామున నాలుగు గంటలకు నెల్లూరు చేరుకున్నారు.
తొలుత చెన్నైకి విమానంలో వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరుకు చేరుకున్నారు. కుమారుడి పార్థివదేహం చూసి ఒక్కసారి ఉద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టారు. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదని బోరున విలపించారు. సహచర మంత్రులు, కుటుంబసభ్యులు ఓదార్చారు.
మంత్రితో చివరి మాటలు
'నాన్నా.. నిషి ఎక్కడున్నావ్. జాగ్రత్తగా ఇంటికి వెళ్లు కన్నా!' మంత్రి నారాయణ చివరగా తన తనయుడు నిషిత్తో అన్న మాటలివి. లండన్లో అధికారిక పర్యటనలో బిజీబిజీగా ఉన్న నారాయణ... భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేసి మాట్లాడారు.
కొడుకుకు జాగ్రత్తలు చెప్పారు. ఆ తర్వాత బుధవారం తెల్లవారుజామున నిషిత్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. నిషిత్ మరణ వార్త ఉదయం అయిదు గంటలకు నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి చేరింది.
నారాయణ ఫోన్ తీయలేదు
అయితే ఈ విషయాన్ని లండన్లో ఉన్న మంత్రి నారాయణకు ఎలా చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు లండన్లో సమయం అర్ధరాత్రి రాత్రి రెండు గంటలు ఉంటుంది. ముందు మంత్రి వెంట వెళ్లిన ఇద్దరు అధికారులకు ఫోన్లు చేసినా వారు లిఫ్ట్ చేయలేదు.
ఆ తర్వాత నారాయణకు చేసినా మంచి నిద్రలో ఉండటంవల్ల కావొచ్చు, ఆయన కూడా ఫోన్ తీసుకోలేకపోయారు. కొద్దిసేపటికి ఓఎస్డీ పెంచల రెడ్డి నుంచి కాల్ ఉండటంతో నారాయణ తిరిగి ఫోన్ చేశారు. అప్పటికే విజయభాస్కర్ రెడ్డిని కూడా టెలీకాన్ఫరెన్స్లో తీసుకుని ఓఎస్డీ మంత్రి నారాయణతో మాట్లాడారు.
గాయాలయ్యాయని..
సార్.. రోడ్డు ప్రమాదంలో నిషిత్ బాబుకు గాయాలయ్యాయని, మీరు వెంటనే బయల్దేరి భారత్ రావాలని చెప్పారు. టీవీల్లో వస్తున్న సమాచారం చూసి అక్కడే నారాయణ అక్కడికి అక్కడే కుప్పకూలిపోయారని తెలుస్తోంది.
పిడుగు పడిందా అన్నట్లు శబ్దం
కాగా, మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మెట్రో పిల్లర్ ఢీకొని నితీష్, ఆయన స్నేహితుడు రాజా రవివర్మ మృతి చెందిన విషయం తెలిసిందే. పిడుగు పడిందా అన్నంత భారీ శబ్దం వచ్చింది. స్థానికులు వచ్చి చూసేసరికే నుజ్జనుజ్జయిన కారులో ఇద్దరు నిర్జీవంగా పడి ఉన్నారు.
కారు స్పీడో మీటర్ 205 వద్ద.
అందులో ఒకరు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కాగా, ఇంకొకరు ఆయన స్నేహితుడు. కారులోని స్పీడోమీటర్ సూచిక 205 కి.మీ. వేగం వద్ద ఆగింది. నారాయణగూడ నుంచి జూబ్లీహిల్స్లోని తన ఇంటికి నిషిత్ స్నేహితుడితో వస్తున్న క్రమంలో వేగం వారిని బలి తీసుకుంది.
సమావేశం అనంతరం..
ఈ ఘోర రోడ్డు ప్రమాదం రెండు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాద సమాచారం తెలియడంతో విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ హుటాహుటిన బయలుదేరారు. నారాయణ విద్యాసంస్థల సంచాలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నిషిత్ నారాయణగూడలోని తమ విద్యాసంస్థల కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు.
వర్షం తగ్గాక వెళ్దామనుకొని..
అర్ధరాత్రి దాటేంత వరకూ సమావేశంలోనే ఉన్నారు. భారీగా వర్షం కురుస్తుండటంతో అది తగ్గాక రాత్రి 2.20 గంటలకు అక్కడి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45లోని నివాసానికి తన మెర్సిడెజ్ బెంజ్ కారు(టీఎస్ 07 ఎఫ్కే 7117)లో బయలుదేరారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దాటిన తరువాత 200 మీటర్ల దూరంలో ఉన్న మెట్రో స్తంభంను ఈ కారు బలంగా ఢీకొంది. ఆ వేగానికి స్తంభాన్ని ఢీకొన్న కారు మళ్లీ రెండు మీటర్లు వెనక్కి వచ్చి ఆగింది.
పిడుగు పడిందనుకున్నారు
భారీ శబ్దానికి స్థానికులు పిడుగు పడిందనుకున్నారు.. నిషిత్ నడుపుతున్న కారు మెట్రో స్తంభాన్ని వేగంగా ఢీకొనడంతో భారీ శబ్దం వచ్చింది. సమీపంలో ఉన్న పెట్రోలింగ్ పోలీసులు ఈ శబ్దం విని ఎక్కడో పిడుగు పడిందని భావించి ఏమైందో చూసేందుకు వెంటనే వెళ్లారు. దాంతో వారికి అక్కడ ప్రమాదానికి గురైన తెల్ల రంగు బెంజ్ కారు కనిపించింది. వెంటనే వెళ్లి చూడగా ఇంజిన్ భాగం మొత్తం నుజ్జునుజ్జుయ్యింది. నిషిత్(23), రాజారవిచంద్ర(23) మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి.
9 బయటకు తీసేందుకు శ్రమించారు
నిషిత్ కుడి కాలు మూడుచోట్ల విరిగిపోయి రక్తం కారుతోంది. కారులోని ఫోన్లు, గుర్తింపు కార్డుల ఆధారంగా పోలీసులు వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను తీసేందుకు తీవ్ర ఇబ్బందులు.. నుజ్జనుజ్జయిన కారు నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు, 108 సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది.
సీట్లు విరగ్గొట్టి..
డ్రైవింగు సీటు వైపు ఉన్న కారు తలుపు తెరుచుకున్నప్పటికీ నిషిత్ మృతదేహం తీయడం వీలు కాలేదు. స్టీరింగ్ అడ్డంగా ఉండటంతో 108 వాహనంలోని గొడ్డలితో స్టీరింగ్, సీట్లను విరగ్గొట్టి ఆయన మృతదేహాన్ని బయటకు తీయాల్సివచ్చింది. ఈలోగా రవిచంద్ర మృతదేహాన్ని తొలుత బయటకు తీశారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించారు. అపోలో వైద్య కళాశాలలో శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
నుజ్జునుజ్జయిన కారు
ప్రమాదం జరిగి కారు నుజ్జునుజ్జయిన సమయంలో 205 కిలోమీటర్ల వేగం స్పీడో మీటర్లో నమోదైందని పోలీసులు గుర్తించారు. మితిమీరిన వేగంతో వాహన నడపడమే ప్రమాదానికి దారితీసిందని భావిస్తున్నారు.
మలుపులా..నిద్రమత్తా విచారణలో తేలుతుంది.. కాగా ఈ ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పశ్చిమ మండలం డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు ఆధారంగా కారు వేగంగా ఢీకొన్నట్లు తెలుస్తోందన్నారు. గాలి సంచులు(ఎయిర్ బ్యాగ్స్) తెరుచుకున్నా ఇద్దరు మరణించారంటే మితిమీరిన వేగం కారణం కావొచ్చన్నారు. మెట్రో స్తంభం వద్ద మలుపు ఉందని.. అది గమనించకుండా వచ్చి ఢీకొట్టారా? లేదంటే ఆ సమయంలో నిద్రమత్తులో ఉన్నారా? అన్నది విచారణలో తేలుతుందన్నారు.