వ్యాపారలావాదేవీలే ఆ హత్యలకు కారణం: మంత్రి నారాయణపై విరుచుకుపడ్డ కరణం
కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించబోనని ఎమ్మెల్సీ కరణం బలరాం జిల్లా ఇన్ చార్జీ మంత్రి పి.నారాయణను హెచ్చరించారు.
ఒంగోలు: కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించబోనని ఎమ్మెల్సీ కరణం బలరాం జిల్లా ఇన్ చార్జీ మంత్రి పి.నారాయణను హెచ్చరించారు. వేమవరం మండలంలో పార్టీ కార్యకర్తల హత్యకు ఎమ్మెల్యే రవికుమార్ వ్యాపార లావాదేవీలే కారణమని ఆయన ఆరోపించారు.జిల్లాలో పార్టీ పరిస్థితులపై నేతలతో మాట్లాడిన సందర్భంలో నారాయణకు పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.అయితే కరణంపై వైరివర్గాలు ఫిర్యాదు చేశాయి. గొట్టిపాటిపై కరణం ఫిర్యాదుచేశారు.
ప్రకాశం జిల్లాలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటిరవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలారం మధ్య గొడవలు సాగుతున్నాయి.అయితే ఈ విషయమై పార్టీ చీప్ చంద్రబాబునాయుడు పార్టీ నాయకులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రమశిక్షణ ఉల్లంఘించి వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తానని ఆయన హెచ్చరించారు.మరో వైపు ఈ ఘటనపై కమిటీని ఏర్పాటుచేస్తానని ప్రకటించారు.ఈ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకొంటామని ప్రకటించారు.
అయితే ప్రకాశం జిల్లాలో పార్టీ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి పి.నారాయణ చర్చించారు.నాయకుల మధ్య సమన్వయం కోసం ఆయన ప్రయత్నాలను ప్రారంభించారు.
కార్యకర్తలను అన్యాయం జరిగితే సహించనన్న కరణం
పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ కరణం బలరాం కూడ జిల్లా ఇంచార్జ్ మంత్రి పి.నారాయణతో రెండు దఫాలు చర్చించారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితిని ఆయనకు వివరించారు.అంతేకాదు అద్దంకి నియోజకవర్గంలో కష్టనష్టాలకు ఓర్చి పార్టీ కోసం కార్యకర్తలు ఎలా పనిచేశారనే విషయమై ఆయన చెప్పారు. కేసులను ఎదుర్కొంటూ,జైళ్ళలో మగ్గిపోయిన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.వైసీపీ నుండి టిడిపిలో చేరిన గొట్టిపాటి వల్లే ఈ పరిస్థితి నెలకొందని కరణం బలరాం ఆరోపించారు.
వ్యాపారలావాదేవీల వల్లే వేమవరం హత్యలు
బల్లికురవ మండలంలోని వేమవరంలో ఇద్దరు టిడిపి నేతల హత్యకు స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వ్యాపార లావాదేవీలే కారణమని కరణం బలరాం మంత్రి పి.నారాయణకు పిర్యాదుచేసినట్టు సమాచారం. ఈ విషయమై విచారణ చేయించాలని కోరినట్టు తెలిసింది. జిల్లాకు చెందిన మరికొందరు పార్టీ నాయకులు కూడ మంత్రి నారాయణను కలిసి తమ వాదనలను విన్పించారు.
మహానాడులోనే జిల్లా నేతలతో మంత్రి భేటీ
మహానాడు సందర్భంగానే విశాఖలోనే చీరాల, అద్దంకి, కందుకూరు, గిద్దలూరు ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, గొట్టిపాటి రవికుమార్, పోతులరామారావు, ముత్తుమల ఆశోక్ రెడ్డితో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. రెండున్నరగంటలపాటు చర్చించారు. నియోజకవర్గాల వారీగా జిల్లాలో అభివృద్దికి సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం ఆశించి తమను పార్టీలో చేర్చుకొన్నారో అది నెరవేరేందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
అవమానం జరిగినా పార్టీ కోసం భరించాం
మినీ మహానాడుకు రెండురోజుల ముందు నాయకుల అభిప్రాయసేకరణ సందర్భంగా చోటుచేసుకొన్న సంఘటన చర్చకు వచ్చినట్టు తెలిసింది. అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ కు అవమానం జరిగిందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన సూచనలను దృష్టిలో ఉంచుకొని తాము హద్దుమీరకుండా వ్యవహరించామన్నారు.వాస్తవాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలని మంత్రికి సూచించారు ఎమ్మెల్యేలు.