కుప్పం కోట కుప్ప కూలడం వెనుక ఆ మంత్రి స్కెచ్: ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే..!
చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జనాదరణ ఏ మాత్రం తగ్గలేదనే విషయం మరోసారి నిరూపితమైంది. ఇదివరకు పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్స్వీప్ చేసిన విధంగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ వైఎస్సార్సీపీ తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటోంది. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ప్రభంజనం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తరువాత కూడా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఏ మాత్రం వీయట్లేదనే విషయాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తోన్నాయి.
#MeToo: కొత్త ముఖ్యమంత్రిపై పాత ఆరోపణలు: ఐఎఎస్ అధికారిణికి అభ్యంతకర మెసేజ్
చిత్తూరుపై ఫోకస్
అన్ని జిల్లాల మాట ఎలా ఉన్నప్పటికీ.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి సొంత జిల్లాలో తనకు ఎదురు లేదని వైఎస్సార్సీపీ మరోసారి నిరూపించుకోగలిగింది ఈ ఎన్నికలతో. చంద్రబాబుకు చుక్కలు చూపించింది. ఆయన సొంత నియోజకవర్గం, సొంత గ్రామంలోనూ దుమ్మురేపింది. ఈ రెండు చోట్ల కూడా తెలుగుదేశం ఘోర పరాజయాన్ని చవి చూసింది. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవితో పాటు అన్ని మండల పరిషత్లను కూడా సొంతం చేసుకుంది వైసీపీ. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం 25 ఎంపీటీసీ స్థానాలకు పరిమితమైంది.
సొంత గ్రామం..సొంత నియోజకవర్గంలో..
చిత్తూరు జిల్లాలో మొత్తంగా 886 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో 822చోట్ల వైసీపీ తన జెండాను ఎగురవేసింది. ఈ 886లో 433 స్థానాలు ఇదివరకే ఏకగ్రీవం అయ్యాయి. అవి పోను 419 చోట్ల పోలింగ్ నిర్వహించారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో 389 ఎంపీటీసీ స్థానాలు వైసీపీ సొంతం అయ్యాయి. 25 చోట్ల మాత్రమే తెలుగుదేశం గెలిచింది. మరో అయిదు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. వైసీపీ అభ్యర్థులు గెలిచిన ఎంపీటీసీ స్థానాల్లో చంద్రబాబు నియోజకవర్గం కుప్పం పరిధిలోని నాలుగు మండలాలు, స్వగ్రామం నారావారి పల్లె ఉన్నాయి.
ఆ నాలుగు మండలాల్లో..
కుపం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కుప్పం, గుడుపల్లి, రామకుప్పం, శాంతిపురం మండలాలు ఉండగా.. వాటన్నింటినీ వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేసింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 17 చోట్ల వైసీపీ గెలిచింది. గుడుపల్లిలో 12కు 12, రామకుప్పంలో 16కు 16 చోట్ల వైసీపీ ఘన విజయాన్ని సాధించింది. క్లీన్ స్వీప్ చేసి పడేసింది. అవన్నీ భారీ ఆధిక్యతతో గెలుచుకున్నవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. చంద్రబాబు సొంత గ్రామం నారావారి పల్లిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
రెండున్నరేళ్లయినా..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లవుతోంది. అయినప్పటికీ వైసీపీ సత్తా ఏ మాత్రం తగ్గలేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. అలాగే- తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం పుంజుకోలేకపోయిందనే విషయం కూడా ఇక్కడ నిరూపితమైంది. చిత్తూరు జిల్లాలో కుప్పం మినహా అన్ని స్థానాలనూ అధికార పార్టీ గెలుచుకుంది. ఇప్పటికప్పుడు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తే- తెలుగుదేశం పార్టీకి ఆ కుప్పం నియోజకవర్గం కూడా దక్కదనేది స్పష్టమైంది.
ఫలించిన పెద్దిరెడ్డి స్కెచ్
చంద్రబాబు నిర్మించుకున్న కుప్పం కోట కుప్పకూల్చడం వెనుక- అదే జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్కెచ్ ఫలించిది. చాప కింద నీరులా తెలుగుదేశం పార్టీని బలహీన పర్చడంలో సక్సెస్ అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి- గ్రామ స్థాయి నుంచి టీడీపీని నరుక్కుంటూ వచ్చారనే విషయాన్ని ఈ ఎన్నికలు తేల్చి చెప్పాయి. ఇదివరకు పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే తరహా తిరుగులేని ఫలితాలను సాధించింది వైసీపీ. అవే రిజల్ట్స్ ఇక్కడా వెలువడ్డాయి. అభ్యర్థుల ఎంపిక మొదలుకుని.. అన్ని స్థాయిల్లోనూ పెద్దిరెడ్డి ఎన్నికలను పర్యవేక్షించారు.
సంక్షేమ పథకాలు కూడా ప్లస్..
కుప్పంలో అధికార పార్టీ పాగా వేయడానికి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు కూడా ఓ కారణం అయ్యాయి. కుప్పం నియోజకవర్గం పరిధిలో చాలామంది వలంటీర్లు నియమితులయ్యారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కూడా పెద్ద ఎత్తున వలంటీర్లుగా నియమితులయ్యారని అంటున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి టీడీపీ ఓటుబ్యాంకు, ఆ పార్టీ అనుకూల కుటుంబాలు కూడా లబ్ది పొందుతున్నాయి. గ్రామ సచివాలయాల నియామకాల్లో టీడీపీ మద్దతుదారులు కూడా ఉద్యోగాలు పొందడం కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
కొత్తవారికి ప్రోత్సాహం..
ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని కుటుంబాలకు చెందిన వారిని మంత్రి పెద్దిరెడ్డి అభ్యర్థులుగా నిలిపారు. పార్టీ కోసం కృషి చేసిన వారికి గుర్తింపు ఇచ్చారు. సాధారణ కార్యకర్తలకు ఎంపీటీసీ అభ్యర్థులుగా నిలిపి, విజయం సాధించగలిగారు. 23 సంవత్సరాల యువతి అశ్వినిని ఎంపిక చేయడం కూడా మంత్రి పెద్దిరెడ్డి వ్యూహంలో ఓ భాగమేనని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, దివంగత చంద్రమౌళి అనుచరులకు ప్రాధాన్యత ఇచ్చారు.
Recommended Video
టీడీపీ పూర్తిగా బలహీనం..
2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత.. చంద్రబాబు కుప్పం కోటకు బీటలు వారడం ఆరంభమైనట్టే కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తొలి రెండు రౌండ్లల్లో చంద్రబాబు వెనుకంజలో ఉండటం అప్పట్లో సంచలనంగా మారింది. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి తొలి రెండు రౌండ్లలో భారీ ఆధిక్యాన్ని కనపరిచారు. దీనితో హోరాహోరీ పోరు తప్పదనే అభిప్రాయం విశ్లేషకుల్లో కనిపించింది. ఆ తరువాత చంద్రబాబు ఆధిక్యతలోకి దూసుకెళ్లారు. 30 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.