సినిమాలో నటించనున్న మంత్రి పల్లె, జగన్ నోరు మూయించా: దేవినేని
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఓ తెలుగు సినిమాలో నటించనున్నారు. సతీ తిమ్మమాంబ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించనునన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని మర్రిమాను చెట్టు విశిష్టత పైన ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ట్రిపుల్ ఎస్ ఆర్ట్ క్రియేషన్ పైన ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా బి సుబ్రహ్మణ్యం, దర్శకుడుగా ఆంజనేయులు వ్యవహరిస్తారు.
జగన్ పైన దేవినేని ఆగ్రహం
పట్టిసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ అధినేత జగన్ విష ప్రచారం చేసినప్పటికీ దానిని పూర్తి చేసి నోరు మూయించామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం అన్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
హంద్రీనీవా ప్రాజెక్టును కూడా సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లను విడుదల చేసిందన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. సీమ ప్రాంతాన్ని హార్టీకల్చర్ హబ్గా మారుస్తామన్నారు.
కుట్రలు, కుతంత్రాలతో పట్టిసీమను అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని మంత్రి దేవినేని, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కలిసి పరిశీలించారు. దేవినేని నీటి పారుదల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
తుంగభద్ర, ఎల్ఎల్సీ, హెచ్ఎస్ఎస్ ఫేజ్ వన్ పనులపై మంత్రి దేవినేని నీటి పారుదల శాఖ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి ప్రతి ఆయకట్టు రైతుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరవు కాలంలో ఉన్నప్పటికి నీటి పారుదల శాఖకు రూ.3వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విధులు సక్రమంగా నిర్వర్తించని అధికారులను మంత్రి మందలించారు.