గ్యాంగ్స్టర్ మధుసూదన్ రెడ్డితో సంబంధాలు!: మంత్రి పల్లె, 'ఆత్మరక్షణలో టిడిపి'
అనంతపురం: బెంగళూరులో దాడికి గురైన గ్యాంగ్ స్టర్ మధుసూదన్ రెడ్డితో తనకు సంబంధాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. పల్లె గురువారం విలేకరులతో మాట్లాడారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో మధుసూదన్ రెడ్డి తన గెలుపు కోసం పని చేశాడని చెప్పారు. అయితే బెంగళూరులో మధుకు ల్యాండ్ సెటిల్మెంట్లతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
కాగా, 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మధుసూదన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి పల్లె బెంగళూరు వెళ్లినప్పుడల్లా మధును కలుస్తాడని అంటున్నారు. సెటిల్మెంట్ల వ్యవహారంలో మధు దొరకడంతో టిడిపి ఆత్మరక్షణలో పడిందని సాక్షి మీడియా రాసింది. ఏపీ, కర్నాటక రాష్ట్రాలలో మధు భారీగా సెటిల్మెంట్లు నిర్వహించినట్లుగా తెలుస్తోందని పేర్కొంది.
ఇదిలా ఉండగా, మద్దెలచెర్వు సూరి ప్రధాన అనుచరుడు మధుసూదన్ రెడ్డిపై దాడి జరిగింది. భూదందాల విషయంలో హెబెట్టు మంజు అనుచరులను మధుసూదన్ రెడ్డి బెదిరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. బెంగళూరులో భూదందాలు నిర్వహిస్తూ హెబెట్టు మంజు అనుచరుల వ్యవహారాల్లో మధుసూదన్ రెడ్డి తలదూర్చారని అంటున్నారు.