టైం వృథా చేసుకోకు, ఇలా చెయ్: పవన్కు పరిటాల సునీత ఆహ్వానం, నాటి పీఆర్పీ నేతకు జనసేన ఝలక్!
గుంటూరు/విశాఖపట్నం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మంత్రి పరిటాల సునీత ఓ సూచన చేశారు. ఆయనకు ఆమె ఆహ్వానం పలికారు. గుంటూరులో సునీత విలేకరులతో మాట్లాడారు. జనసేనాని తమతో కలిసి ముందుకు నడిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ది యువరక్తమని చెప్పారు.
Recommended Video
షాకింగ్.. ఇగో వదిలేయండి: చంద్రబాబుపై మమత ఒత్తిడి, సోనియా గాంధీ సిద్ధం? జగన్పై దీదీ ఇలా
ఆయన యాత్రల పేరుతో సమయం వృథా చేసుకోవడం అనవసరమని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు సాగితే బాగుంటుందని ఆమె అన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని చెప్పారు.
గొంతు నొప్పి వల్ల రిసార్టుకే పరిమితం, ఎవరినీ అనుమతించలేదు
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ విశాఖ మన్యం పర్యటనలో భాగంగా శనివారం రాత్రి అరకులోయకు చేరుకున్నారు. పద్మాపురంలోని ఓ రిసార్టులో బస చేశారు. ఆదివారం అరకులోయలోని రిసార్టులో విశ్రాంతి తీసుకున్నారు. జిల్లాలోని జనసేన ప్రతినిధులతో పాటు మన్యంలోని అభిమానులు కొంతమందితో రిసార్టులోనే సమావేశమయ్యారు. స్థానిక పరిస్థితులు, సమస్యలపై చర్చించారు. ఆదివారం నుంచి రిసార్ట్ మొత్తాన్ని జనసేన వర్గాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. అనుమతి లేనిదే రిసార్టులోనికి ఎవరినీ అనుమతించలేదు. గొంతు నొప్పి కారణంగా పవన్ ఎవరినీ కలవలేదని జనసేన వర్గాలు వెల్లడించాయి.
మాజీ ఎమ్మెల్యే వస్తే నో చెప్పిన సిబ్బంది
గతంలో ప్రజారాజ్యం పార్టీకి చెందిన గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య ఉదయం పవన్ కళ్యాణ్ను కలిసేందుకు వచ్చారు. అయితే ఆయనను లోనికి అనుమతించలేదు. దీంతో ఆయన పవన్ పీఏతో మాట్లాడి, తిరిగి వెళ్లిపోయారు. ఆయననే కాదు.. పవన్ వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. గత కొద్ది రోజులుగా ఆయన వరుసగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
విజయనగరం అర్జీల పరిశీలన
కాగా, పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. విజయనగరం జిల్లాలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిశీలించడంతో పాటు విశాఖ మన్యంలో ప్రస్తుత పరిస్థితి, నెలకొన్న సమస్యలపై పవన్ ఆరా తీశారు. మరోవైపు, కొద్దిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అరకులోయ రోడ్డు షో, బహిరంగ సభ నిర్వహణల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.
రిసార్టులోని మొత్తం గదులు జనసేనకే
రిసార్టులోని మొత్తం గదులను జనసేన బుక్ చేసుకుంది. దీంతో ఆదివారం పర్యాటకులకు ఎవరికీ గదులు అద్దెకు ఇవ్వలేదు. దీంతో పర్యాటకులు కొందరు ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన కోసం అభిమానులు వేచి చూస్తున్నారు.