రోజా చంద్రన్న మాల్స్ ఎఫెక్ట్: 'భారతి'ని లాగిన టీడీపీ! జగన్-లోకేష్లకు తేడా ఇదే
Recommended Video
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు బుధవారం కౌంటర్ ఇచ్చారు. రోజా అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. హెరిటేజ్, చంద్రబాబు వ్యాపారం గురించి మాట్లాడటాన్ని ఖండించారు.
చంద్రన్న మాల్స్ పైన ఆరోపణలు సరికాదన్నారు. విజయవాడ విద్యాధరపురంలో చంద్రన్న విలేజ్ మాల్ను మంత్రి సందర్శించారు. ఆయన సరుకుల ధరలు, నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
రేషన్కు చంద్రన్న మాల్స్కు సంబంధం లేదు
రేషన్కు, చంద్రన్న విలేజ్ మాల్స్కు ఏమాత్రం సంబంధం లేదని పత్తిపాటి చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ, గుంటూరులలో వీటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వినియోగదారులకు 4 నుంచి 35 శాతం వరకు తక్కువ ధరకు సరుకులు ఇస్తున్నట్లు తెలిపారు.
500 రకాల సరుకులు దొరుకుతాయి
అలాగే డీలర్లకు ఆదాయం సమకూరే విధంగా చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేసినట్లు పత్తిపాటి తెలిపారు. చంద్రన్న మాల్స్లో 500 రకాల సరుకులు లభిస్తున్నాయని ఆయన చెప్పారు. నాణ్యమైన సరుకులు తక్కువ ధరకు ఇవ్వడం వైసీపీకి ఇష్టం లేదా అని ప్రశ్నించారు.
భారతి సిమెంట్స్ గురించి మాట్లాడరేం
భారతీ సిమెంట్స్ గురించి రోజా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. భారతీ సిమెంట్ తక్కువ ధరకు ఎందుకు అమ్మడం లేదని ఆయన అడిగారు. రాష్ట్రం కోసం శ్రమిస్తున్న చంద్రబాబు పేరు పెడితే తప్పేమిటన్నారు. పథకాలు, పేర్ల గురించి విమర్శించే అర్హత వైసీపీకి లేదన్నారు.
చంద్రన్న మాల్స్లో అవినీతి లేదు
చంద్రన్న మాల్స్లో ఎలాంటి అవినీతి లేదని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి లేదని తెలిశాక చంద్రన్న మాల్స్ పైన విమర్శలు చేస్తున్నారన్నారు. జనవరి నుంచి రేషన్లో పంచదార పంపిణీ ఉంటుందన్నారు. వైయస్ హయాంలో రేషన్ బియ్యంలో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. కొత్త రాష్ట్రానికి మంత్రి లోకేష్ ఎన్నో కంపెనీలు తీసుకు వచ్చారన్నారు. వైయస్ హయాంలో జగన్కు ముడుపులు ఇచ్చే సంస్కృతి ఉండేదన్నారు.