24 గంటల్లో: మంత్రి, టీడీపీకి మద్దతిస్తాం: మైసూరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులకు మంగళవారం సాయంత్రం నాటికి రుణవిముక్తి కల్పిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఐనవోలు, శాఖమూరు, నేలపాడు గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు.
29 గ్రామాల్లో 23వేల మందికి రుణ ఖాతాలు ఉన్నాయని చెప్పారు. మంగళవారం సాయంత్రంకల్లా 21,500 మందికి రుణవిముక్తి కల్పిస్తామన్నారు. మిగిలిన 1500 మందిని కూడా త్వరలోనే రుణ విముక్తుల్ని చేస్తామన్నారు.
ఒక్కో రైతుకు రూ.లక్షన్నర రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ఆయన పలు గ్రామాల్లో చెక్కులను పంపిణీ చేశారు. కాగా, రుణమాఫీ కోసం ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేశారు.
టీడీపీకీ మద్దతిస్తాం: మైసూరా రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు పార్లమెంటులో తెలుగుదేశం పోరాడితే తాము, తమ పార్టీ ఎంపీలు మద్దతిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరా రెడ్డి సోమవారం తెలిపారు. లేదంటే తమ పార్టీ ఎంపీలు చేసే పోరాటానికి టీడీపీ మద్దతివ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానం ప్రతిపాదించినా తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ సాకులు చెప్పడం సరికాదన్నారు. బీజేపీ సాకుల నేపథ్యంలో టీడీపీ తమ వైఖరిని స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వం పైన అన్ని పార్టీలు కలిసి ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయన్నారు.