వైసీపీని చిత్తు చేయాలి: '2019లో ఒబామా వాడిన టెక్నాలజీతో చంద్రబాబు'
అమరావతి: 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా క్లీన్ స్వీప్ చేయాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. గురువారం గుంటూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీని లేకుండా చేయాలంటే అందుకు టీఎన్ఎస్ఎఫ్ సహాకారం అందించాలని ఆయన కోరారు. ఆమెరికా ఎన్నికల ప్రచారంలో ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా వాడినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కూడా వినియోగించనున్నారని ఆయన పేర్కొన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని నేరుగా ప్రజల మొబైల్ ఫోన్కే పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
రాబోయే ఎన్నికల నాటికి టీఎన్ఎస్ఎఫ్ బలోపేతం కావాలని ఆకాంక్షించిన మంత్రి టీడీపీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. ఈ సదస్సుకు హాజరైన మరో మంత్రి రావెల కిశోర్ బాబు మాట్లాడుతూ జగన్ మీడియా ప్రభుత్వంపై చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.
గత ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రంలో పేదరికం పెరిగిందని ఆయన మండిపడ్డారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రణాళిక రూపొందించుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ కార్యక్రమాల కమిటీ కన్వీనర్ వీవీవీ చౌదరి సూచించారు.
ఈ విద్యార్ధి సదస్సుకు గుంటూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుతో పాటు టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు.