పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పత్తిపాటి స్పందన, వెంటనే చంద్రబాబులో కదలిక
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదివారం నాడు స్పందించారు. పవన్ సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మార్కెట్ యార్డు గోదాం నిర్మాణానికి ఈ ఉదయం పత్తిపాటి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆక్వా ఫుడ్ పార్క్ పైన పవన్ కళ్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రైతుల సమస్యలు పరిష్కరించాకే ముందుకెళ్తామని తెలిపారు. ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఫుడ్ పార్క్ పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
పరిశీలిస్తాం: చినరాజప్ప
జనసేన అధినేత, పవన్ కళ్యాణ్ సూచనలను పాటిస్తామని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చెప్పారు. ఆయన మంచి సూచనలు ఇస్తే తీసుకుంటామని అభిప్రాయపడ్డారు.
పవన్ హెచ్చరిక.. చంద్రబాబులో కదలిక
మెగా అక్వా ఫుడ్ పార్క్ పైన పవన్ కళ్యాణ్ సూచనల నేపథ్యంలో చంద్రబాబులో కదలిక వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ రోజు చంద్రబాబు దీనిపై సమీక్ష నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్కు పైన చంద్రబాబు నేతలు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పవన్ వచ్చి వెళ్లిన మరుసటి రోజే స్పందన రావడం గమనార్హం.
మనదే పైచేయి కావాలి: చంద్రబాబు
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, రాష్ట్ర పార్టీ బాధ్యులు, టిడిపి ఇంఛార్జాులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు గెలుపొందాలని, ఓటర్ల నమోదుకు మరో 20 రోజులు గడువు ఉందని చెప్పారు.
అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో చూపే శ్రద్ధ పరోక్ష ఎన్నికల్లో చూపట్లేదని, సరైన ప్రణాళిక, సంస్థాగత నైపుణ్యంతో పరోక్ష ఎన్నికల్లో గెలుపు తథ్యమన్నారు. నవంబర్ 5వరకు జరిగే ఓటర్ల నమోదులో అందరూ ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో మనదే పైచేయి కావాలన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి జెండా ఎగరాలన్నారు. విపక్షానికి చోటు లేకుండా చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలన్నారు. గత ఎన్నికలలో పొరపాట్ల కారణంగా వెనుకబడ్డామని చెప్పారు. గ్రూపులు కడితే బాగుండదని హెచ్చరించారు.
రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో సరైన ప్రణాళిక, సంస్థాగత సామర్థ్యం ఉంటే గెలుపు ఖాయమన్నారు. ఇది నా ఎన్నిక కాదని ఎవరూ నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు.
నీతివంతమైన వ్యాపారం, విలువలతో కూడిన రాజకీయాలకు తన జీవితమే ఉదాహరణ అని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వం నుంచి చిన్న సహకారం లేకుండా హెరిటేజ్ సంస్థను విజయవంతంగా నడుపుతున్నామంటే దానికి రైతుల తోడ్పాడు, సిబ్బంది ప్రతిభ, కుటుంబ సభ్యుల సహకారం ఉందన్నారు.
ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా పార్టీ పరంగా ఒక్క తప్పు జరిగినా ఫలితాలు రావన్నారు. ముఖ్యమంత్రిగా నేను తప్పు చేస్తే రాష్ట్రం మొత్తం దాని ప్రభావం ఉంటుందని, ప్రజాప్రతినిధిగా తప్పు చేస్తే వారి నియోజకవర్గం, గ్రామం మొత్తంపై ప్రభావం పడుతుందన్నారు.