హోదా ఇవ్వకపోయినా: పత్తిపాటి, ట్యాపింగ్, సెక్షన్8పై బాబుకు ప్రశ్న
గుంటూరు/విజయవాడ: కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతి తెలుగు వ్యక్తి కోరుకుంటున్నారని, సాంకేతిక అంశాలను అధిగమించి న్యాయం చేయాలని మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదివారం అన్నారు.
గుంటూరులో ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా... ఆంధ్రుల హక్కు పేరుతో నిర్వహించిన సదస్సులో మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోటులో ఉందని, ఈ లోటు భర్తీకి కేంద్రం సహకరించాలన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం అందరం కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరముందన్నారు. ఏపీకీ హోదా కోసం 7వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు చెప్పారు. కాగా, ఈ సందర్భంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు.
అమరావతి తప్ప కనిపించడం లేదు: రాఘవులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాజధాని అమరావతి తప్ప మరొకటి కనిపించడం లేదని సిపిఎం నేత రాఘవులు అన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం పైన తెలుగుదేశం పార్టీ ఒత్తిడి చేయడంలో విఫలమవుతోందన్నారు.
ఓటుకు నోటు కేసు దృష్ట్యా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి తీసుకు రావడం వెనుక ప్రజల దృష్టిని మరల్చడమే అన్నారు. సెక్షన్ 8 అమలు పైన తెలుగుదేశం పార్టీ ముందే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.