3 కాదు 30 రాజధానులు, అమరావతిలో ఆందోళన చేసేదీ టీడీపీ శ్రేణులే, మంత్రి పెద్దిరెడ్డి ఫైర్
నవ్యాంధ్రకు మూడు చోట్ల కాకుంటే 30 చోట్ల రాజధానులు పెడతామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మూడు రాజధానులతో అధికార వికేంద్రీకరణ జరుగుతుందని చెప్పారు. దీంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాజధాని అంశం కేంద్రానికి సంబంధం లేదని, రాష్ట్ర పరిధిలోని ఇష్యే అని చెప్పారు. అమరావతిలో ఆందోళన చేసేవారు టీడీపీకి చెందిన నేతలు, కార్యకర్తలేనని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ను అభివృద్ది చేశారని, దీంతో భాగ్యనగరం లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి చెప్పారు. మళ్లీ అలాంటి తప్పు జరగకూడదనే ఉద్దేశంతో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిందని చెప్పారు. పాలన వికేంద్రీకరణ జరిగితే అభివృద్ధి దానంతట అదే జరుగుతుందని చెప్పారు. అమరావతి ప్రాంతానికి చెందిన కొందరు వైసీపీ నేతలు రాజధాని తరలించొద్దని మాట్లాడి ఉండొచ్చని.. కానీ వారు కూడా సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పారు.
పల్లె కానీ, పట్నం కానీ విజయవాడలో రాజధాని పెట్టడంతో ఉద్యోగులకు పనిలేకుండా పోయిందని గుర్తుచేశారు. వారికి 5 రోజులే పనిదినాలను చంద్రబాబు పెట్టడం వల్లే వారు మిగతా రెండురోజులు హైదరాబాద్ వెళ్లేవారని గుర్తుచేశారు. అమరావతిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు భూములు కొనుగోలు చేశారని, అక్కడ రైతులెవరూ లేరని చెప్పారు. టీడీపీకి చెందిన నేతల కోసమే చంద్రబాబు రాజధాని పెట్టారని.. ఇప్పుడు ఆందోళన చేస్తున్న వారంతా టీడీపీ కార్యకర్తలేనని పేర్కొన్నారు.