అమరావతి భూములు వెనక్కిచ్చేస్తాం: 3 కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటాం: మంత్రి పెద్దిరెడ్డి సంచలనం..!
ఏపీలో మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు..అమరావతిలో ఆందోళన కొనసాగుతున్న వేళ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాఖలో భూములు కొన్నామని అనడం సరైంది కాదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సచివాలయం తాత్కాలికమని చంద్రబాబే చెప్పారన్నారు. మూడు కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటామని తెలిపారు. రాజధానులకు కేంద్రం అనుమతులు, నిధులు అవసరం లేదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
అమరావతిలో రైతుల భూములను వెనక్కి ఇచ్చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇదే విషయాన్ని ఎన్నికల ముందే జగన్ చెప్పారని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే అమరావతిలో ఆందోళన చేస్తున్న సమయంలో మంత్రి వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారుతున్నాయి.
రైతుల భూములు ఇచ్చేస్తాం..
ముఖ్యమంత్రి జగన్ ఏపీలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉంటాయని చేసిన ప్రకటన ప్రకంపణలకు కారణమవుతోంది. దీని పైన ఇప్పటికే అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. రాజధానిలో రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తామంటూ చెప్పుకొచ్చారు.
దీనికి కొనసాగింపుగా రాజధానిలో భూములు వెనక్కి ఇస్తామని ఎన్నికల ముందే జగన్ చెప్పారని వెల్లడించారు. అమరావతిలో టీడీపీ కార్యకర్తలే ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే రైతులు తాము రాజధానికి ఇచ్చిన సమయంలో ఎలాంటి భూములు ఇచ్చామో...అదే విధంగా తమకు ఆ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమవుతున్నాయి.
3 కాకపోతే 33 రాజధానులు..
రాజధానిలో జరిగిన అసెంబ్లీ..సచివాలయ నిర్మాణాలు తాత్కాలికమేనని చంద్రబాబు చెప్పిన విషయాన్ని పెద్దిరెడ్డి గుర్తు చేసారు. మూడు కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. కేంద్రానికి ఈ విషయంలో సంబంధం ఉండదని వివరించారు. రాజధానులకు కేంద్రం అనుమతులు, నిధులు అవసరం లేదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. మార్చిలో స్థానిక ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు.
తెలంగాణ తరహాలో ఇంటింటికి తాగునీరు ఇస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. ఒక వైపు అధికారుల కమిటీ ప్రభుత్వానికి ఈ రోజు నివేదిక ఇస్తుండటం..రాజధాని అంశం మీద భిన్న వాదనలు వ్యక్తం అవుతున్న ఈ సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి.
టీడీపీ కార్యకర్తలే ఆందోళన చేస్తున్నారు..
అమరావతిలో జరుగుతున్న ఆందోళనల మీద మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. అమరావతిలో టీడీపీ కార్యకర్తలే ఆందోళనలు చేస్తున్నారన్నారు. విశాఖలో ఇప్పటికే భూముల ధరలు పెరిగాయన్నారు. విశాఖలో భూములు కొన్నామని అనడం సరైంది కాదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ..సచివాలయానికి రెండు వందల ఎకరాలు చాలని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి ప్రకటన తరువాత ఉత్తరాంధ్ర..రాయలసీమ ప్రాంతాల్లో హర్షం వ్యక్తం అవుతున్నా..అమరావతి ప్రాంతంలో మాత్రం నిరసన వ్యక్తం అవుతోంది. అయితే, కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ సమయంలోనే మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.