చావుకు దగ్గరగా వెళ్లి వచ్చా: 'ప్రాణాలతో విమానం దిగుతామని అనిపించలేదు'
హైదరాబాద్: 'చావుకు దగ్గరగా వెళ్లి వచ్చా... ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదు' ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా ఏపీ మంత్రి పీతల సుజాత. ఇంతకీ ఆమె ఎందుకు చావు వరకు వెళ్లొచ్చారు అనే కదా మీ ప్రశ్న. క్యుములో నింబస్ మేఘాల కారణంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే.
శుక్రవారం సాయంత్రం సంభవించిన గాలివానకు కొన్ని నిమిషాల ముందు మంత్రి పీతల సుజాత విజయవాడకు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్ విమానాన్ని ఎక్కారు. సాయంత్రం కురిసిన భారీ వర్షం, గాలివాన బీభత్సం ప్రభావం శంషాబాద్ ఎయిర్ పోర్టుపై కూడా పడింది.
దీంతో స్పైస్ జెట్ విమానం తీవ్ర కుదుపులకు లోను కాగా, అందులో ఉన్న వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనలకు గురయ్యారు. సాయంత్రం ఐదు గంటల నుంచి పలు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన విమానాల్లో 'స్పైస్ జెట్'వి ఉన్నాయి.
ఈ స్పైజ్ జెట్ విమానంలో ఉన్న మంత్రి పీతల సుజాత శనివారం విలేకరులతో మాట్లాడుతూ తన అనుభవాన్ని వివరించారు. "చావుకు దగ్గరగా వెళ్లి వచ్చాను. ఎంతో మంది ప్రయాణికులు కన్నీరు పెట్టుకున్నారు. పెద్ద కుదుపులు, శబ్దాలు రావడంతో ఏం చేయాలో పాలు పోలేదు. ప్రాణాలతో విమానం దిగుతామని అనిపించలేదు. కుదుపులు ఎలా ఉన్నాయంటే, ఓసారి నా తల విమానం పై భాగానికి తగిలింది. విజయవాడలో క్షేమంగా ల్యాండ్ అయిన తరువాతనే ఊపిరి పీల్చుకున్నాం" అన్నారు.
కాగా, ఇదే విమానంలో ఉన్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల రెడ్డి స్పందిస్తూ, ఇంత గాలిలో విమానం టేకాఫ్ కాకుండా ఉంటే బాగుండేదని చెప్పారు. కాగా, స్పైస్ జెట్ విమానం బయల్దేరిన తర్వాత, ఈదురు గాలులు శంషాబాద్ విమానాశ్రయాన్ని తాకగా, రెండు గంటల పాటు టేకాఫ్, ల్యాండింగ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ ఈదురు గాలులకు తోడు వర్షం కురువడంతో నగరం చిగురుటాకులా వణికిపోయింది. భారీ చెట్లు, హోర్డింగ్లు నెలకూలాయి. విద్యుత్ స్తంభాలు, తీగలపై చెట్లు, కొమ్మలు పడటంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.