లోకేష్ ను తిట్టబోయి..చంద్రబాబును మెచ్చుకున్న మంత్రిగారు! పబ్లిసిటీ లేక పిచ్చిపట్టినట్టుందా?
విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తనకు తెలియకుండానే మెచ్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మంత్రి. చంద్రబాబును పొగిడేశారు. చంద్రబాబు వంటి మేధావి వర్గానికి చెందిన రాజకీయ నాయకుడికి నారా లోకేష్ వంటి కుమారుడు జన్మించడం పండిత పుత్రుడు..పరమ శుంఠుడు అనే సామెతను గుర్తుకు తెస్తోందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి నారా లోకేష్ వ్యవహారం అంతా పండిత్ర పుత్ర: పరమశుంఠ అనే వ్యవహారాన్ని తలపిస్తోందని రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ నాని ఆరోపించారు. బందర్ పోర్టు తెలంగాణకు ధారాదాత్తం చేస్తున్నారంటూ లోకేష్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, విమర్శించడానికి ఇంకేమీ దొరకనందుకే..ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
పేట్రేగిన గన్ కల్చర్: వాల్ మార్ట్ స్టోర్ లో రక్తపాతం: 20 మంది దుర్మరణం
రహస్య జీవోలంటూ వాటిని డౌన్లోడ్ కూడా చేయడం లోకేష్ కు చేతకావట్లేదని అన్నారు. చంద్రబాబు నాయుడికి, ఆయన కుమారుడికి పబ్లిసిటీ అంటే ఎంత పిచ్చో అందరికీ తెలుసుని, అధికారాన్ని కోల్పోయిన తరువాత సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్ల వారిద్దరికీ పిచ్చిపట్టినట్టు ఉందని అన్నారు. అందుకే ఆ చీప్ పబ్లిసిటీ కోసం చంద్రబాబు, లోకేష్ బాబు బందరు పోర్టుపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాటు రాష్ట్రానికి ఉన్న హక్కుల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు తాకట్టు పెట్టేసి, కేసుల భయంతో తండ్రీకొడుకులు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన విషయం నిజం కాదా?.. అని పేర్ని నాని ప్రశ్నించారు.
పోలవరాన్ని నిర్మించడం చేతకాక..కమీషన్ల పేరుతో భారీగా దండుకున్నారని ఆరోపించారు. బందరు పోర్టు పనులను నవయుగ కంపెనీ చేయకపోతే తామే చేపడతామని స్పష్టం చేశారు. జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయంగా బతికున్నానని చెప్పుకోవడానికే బందరు పోర్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఉమామహేశ్వరరావుకు కొల్లు రవీంద్ర ఒకరు తోడయ్యారని ధ్వజమెత్తారు. బందరు పోర్ట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు వైఎస్సార్ హయాంలోనే వచ్చాయని గుర్తుచేశారు. నారా లోకేష్ ఎవరో రాసిచ్చినవి ట్విట్టర్లో పెట్టడం సరికాదని మంత్రి పేర్ని నాని సూచించారు.