మంత్రి పేర్నినాని అనుచరుడు మోకా భాస్కరరావు దారుణహత్య, కత్తితో పొడిచి పరార్..
కృష్ణా జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. మచిలీపట్నంలో వైసీపీ నేతను దుండగులు హతమార్చారు. చనిపోయిన వైసీపీ నేత మోకా భాస్కరరావు మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు. సోమవారం భాస్కరరావు మున్సిపల్ చేపల మార్కెట్లో ఉండగా.. గుర్తుతెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. వెంటనే అతనిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. వైసీపీ నేత భాస్కరరావు మృతిచెందడంతో మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది.
మోకా భాస్కరరావుపై పాత కక్షలతోనే దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. భాస్కరరావు చనిపోయారని తెలుసుకున్న కార్యకర్తలు ఆస్పత్రి ప్రాంగణానికి భారీగా చేరుకున్నారు. ఆస్పత్రి వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు. మచిలీపట్నంలో పలు ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. భాస్కరరావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్ట్ మాజీ చైర్మన్గా కూడా పనిచేశారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటిపైకి కొందరు భాస్కరరావు అనుచరులు వెళ్లారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మచిలీపట్నంలో 144 సెక్షన్ విధించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.