సీఎం జగన్ ఆదేశాలివే.. కరోనా నియంత్రణ చర్యలపై పేర్ని నాని కీలక ప్రకటన..
కరోనా వైరస్ కారణంగా దేశ,రాష్ట్రాల ఆర్థిక ప్రగతి కుదేలైందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ నియంత్రణ చర్యల విషయంలో ఖర్చుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ చర్యల కోసం నిరంతరంగా పనిచేసేలా కేబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు ఆళ్ల నాని,బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,బొత్స సత్యనారాయణ,మేకతోటి సుచరితలతో పాటు 10 మంది ఐఏఎస్లు ఉండనున్నారు. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం సరికాదని నిర్ణయించిన కేబినెట్... రాబోయే మూడు నెలలకు ఓటాన్ బడ్జెట్ను ఆమోదించింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో వెల్లడించారు.
క్వారెంటైన్ కేంద్రాలు... కరోనా ఆసుపత్రులు..
ప్రస్తుతం రాష్ట్రంలో 11 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్ని నాని తెలిపారు. విదేశాల నుంచి 28వేల మంది రాష్ట్రానికి వచ్చినట్టు తెలిపారు. కరోనాకు సంబంధించి 24గంటల పాటు అందుబాటులో ఉండే 104 హెల్ప్ లైన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో 60 లైన్లు నిరంతరం పనిచేస్తాయని చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో 1500 పడకలతో.. జిల్లా కేంద్రాల్లో 200 పడకలతో క్వారెంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కరోనా అనుమానిత కేసులన్నింటికీ ఇక్కడ చికిత్స అందిస్తారని చెప్పారు. ఇక విశాఖపట్నం,విజయవాడ,నెల్లూరు,తిరుపతి నగరాల్లో ప్రత్యేక కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతీ ఆసుపత్రిలో 100 వెంటిలేటర్లతో కూడిన పడకలను ఏర్పాటు చేశామన్నారు. కరోనా సోకిన రోగులందరికీ ఇక్కడ చికిత్స అందిస్తారని తెలిపారు.
అందుబాటులో ఉన్న మాస్కులెన్ని..
మొదట మార్చి 31 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని ప్రభుత్వం భావించిందని.. కానీ ప్రధాని మోదీ ఆదేశాలతో ఏప్రిల్ 14 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడగించామని తెలిపారు. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించే నర్సులు,డాక్టర్లకు N95 మాస్కులను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 52వేల N95 మాస్కులు ఉన్నాయని.. డాక్టర్లు,నర్సుల కోసం పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ 4వేలు అందుబాటులో ఉన్నాయన్నారు. హెచ్ఐవి ట్రీట్మెంట్ కోసం ఉపయోగించే కిట్లను కూడా ఇందుకు ఉపయోగిస్తామన్నారు. సర్జికల్ మాస్కులు 10లక్షల వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. రాబోయే రెండు రోజుల్లో వాటిని ఆసుపత్రులకు పంపిణీ చేస్తామన్నారు. అత్యవసర నిధుల కింద ప్రతీ జిల్లా కలెక్టర్కు రూ.2కోట్లు నిధులు ఇస్తున్నట్టు తెలిపారు.
ఉపాధి హామీ కూలీ పనులు..
అన్ని రకాల సరుకుల రవాణా వాహనాలను రాష్ట్రంలోకి అనుమతిస్తామని.. ఇందుకోసం పొరుగు రాష్ట్రాలతో కూడా మాట్లాడాల్సిందిగా సీఎం సీఎస్ను ఆదేశించారని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విధించిన కర్ఫ్యూ.. ఫిజికల్ కర్ఫ్యూ కాదని.. సోషల్ కర్ఫ్యూ అని గుర్తుచేశారు. ప్రతీ ఒక్కరికి స్వీయ నియంత్రణ అవసరమని.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పారు. గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని.. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. ఆక్వా కార్యకాపాలకు సంబంధించి.. మేత,మందులు,సరుకు రవాణా,కంటైనర్లను ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారన్నారు. దీనిపై మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ నేత్రుత్వంలో శనివారం అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుందన్నారు.